ఢిల్లీ వివాదం కొత్తమలుపు: గవర్నర్ అధికారాలపై గెజిట్, కేజ్రీవాల్కు షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెప్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకీ కొత్త మలుపు తిరుగుతుంది. లెప్టెనెంట్ గవర్నర్గా నజీబ్ జంగ్కున్న విశిష్ట అధికారాలను కేంద్రం ప్రకటించింది. అధికారులను పోస్టింగ్ చేయడం, బదిలీలు, తొలగింపు వంటి అధికారాలు గవర్నర్కు ఉన్నాయని, ఈ విషయంలో మందస్తు సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
దీనికి సంబంధించి లెప్టినెంట్ గవర్నర్ అధికారాలను తెలుపుతూ గెటిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు, శాంతి భద్రతలు, పోలీస్, భూములు తదితర విషయాలు ఆయన పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఆటంకాలు కల్పిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు.
కేంద్రం ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని ఆయన అన్నారు. ప్రజల నుంచి ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్టినెంట్ గవర్నర్ నియామకాలు, బదిలీలు చేస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. దీంతో ఢిల్లీ వివాదంపై హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రధాని మోడీని కలిశారు. ప్రధాని నరేంద్రమోడీ జోక్యంతోనే హోం శాఖ శుక్రవారం ఈ గెటిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
హోం శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్పై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా మాట్లాడుతూ అధికారుల బదిలీలను నియంత్రించేందుకు ఢిల్లీలోని ఉన్నతాధికారులు చేసే ప్రయత్నమని చెప్పారు. ఇదే విషయంపై స్పందించిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాట్లాడుతూ ఢిల్లీ భిన్నమైన రాష్ట్రామని, పాలించడం నేర్చుకోవాలని సూచించారు.