ధర్డ్ వేవ్ భయాలు కోవిడ్ ఆంక్షల్ని నవంబర్ 30 వరకూ పొడిగించిన కేంద్రం-అక్కడ లాక్ డౌన్
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతున్నా కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కొనసాగుతోంది. దీంతో ధర్డ్ వేవ్ తప్పదన్న భయాలు నెలకొంటున్నాయి. కోవిడ్ పెట్టిన భయం జనం మనసుల్లో నుంచి ఇంకా తొలగిపోలేదు. అందుకే బయట స్వేచ్ఛగా తిరగాలన్నా, గతంలోలా విహరించాలన్నా భయపడుతున్నారు. దీంతో కేంద్రం కూడా ఛాన్స్ తీసుకోదల్చుకోలేదు.
దేశవ్యాప్తంగా కోవిడ్ ధర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో గతంలో విధించిన కోవిడ్ మార్గదర్శాలను, ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి నవంబర్ 30వ తేదీ వరకూ కోవిడ్ మార్గదర్శకాలను పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలలో దీపావళితో పాటు ఇతర పండుగలు కూడా ఉన్నందున కోవిడ్ వ్యాప్తి కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గత నెలలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కంటైన్ మెంట్ జోన్ల బయట సినిమా హాళ్లు, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, స్విమ్నింగ్ పూల్స్ కార్యకలాపాలు మాత్రం కొనసాగుతాయని హోంశాఖ ప్రకటనలో తెలిపింది. గతంలో సెప్టెంబర్ 30న ప్రకటించిన మార్గదర్శకాలు అక్టోబర్ 31తో ముగియబోతున్నాయి. దీంతో కేంద్రం మరో పొడిగింపుపై ప్రకటన చేసింది.
మాస్క్ వాడకం, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలను కూడా కచ్చితంగా అమల్యయేలా చూడాలని కేంద్ర హోంశాఖ.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. వీటిలో రాజీ పడితే మాత్రం కోవిడ్ ముప్పు తప్పదని హెచ్చరించింది. ఇప్పటికే అమల్లో ఉన్న కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగిస్తూనే మిగతా ప్రాంతాల్లో కోవిడ్ ముప్పు లేకుండా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మార్గదర్శకాలను కొనసాగించేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తున్నాయి.