కరోనా మహమ్మారి కట్టడికి ఆంక్షలను మరోసారి పొడిగించిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగించింది కేంద్రం. పండగల సీజన్ కావడంతో కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలను నవంబర్ 30 వరకు పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 28న జారీ చేసిన నిబంధనలు అక్టోబర్ 31తో ముగియనున్న నేపథ్యంలో వాటిని మరోసారి పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు తగ్గినట్లు తగ్గి మరో రోజు పెరుగుతున్నాయి. మరోవైపు, బ్రిటన్, రష్యాల్లో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా ప్లస్ కొత్త రకం కేసులు మన దేశంలోనూ నమోదవుతున్నాయి. ఏవై.4.2 రకం వైరస్ లక్షణాలు ఉన్నవారి సంఖ్య పె రుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలలకు కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రణాలికలు సిద్ధం చేస్తోంది. వ్యాక్సినేషన్లో వెనుకబడిన రాష్ట్రాలు, జిల్లాలపై ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచనుంది.
కాగా, దేశంలో కరోనా వైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 12.90,900 నమూనాలను పరీక్షించగా.. 16,156 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.42 కోట్లకు పెరిగింది. బుధవారం 733 మంది కరోనా బారినపడి మరణించారు. ఈ మరణాల్లో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 622 ఉండటం గమనార్హం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,56,386కు పెరిగింది. గత 24 గంటల్లో 17,095 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.36 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,60,989 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 98.20 శాతానికి పెరగ్గా, పాజిటివిటీ రేటు 0.47 శాతానికి తగ్గింది. బుధవారం 49,09,254 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ శారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారి సంఖ్య 104 కోట్లు దాటింది.