నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ప్రక్రియపై సుప్రీం సీరియస్ వ్యాఖ్యలు
జాతీయ పౌరసత్వ పట్టికకు సంబంధించి కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అసలు కేంద్రానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)పై కేంద్రం ఏం చెప్పింది... సుప్రీం కోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది.. అసలు ఎన్ఆర్సీ అంటే ఏమిటి..?
ఎన్ఆర్సీ అంటే ఏమిటి..?
జాతీయ పౌరసత్వ పట్టిక దీన్నే ఇంగ్లీషులో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ అంటున్నాం. అస్సోంలో భారత పౌరసత్వం ఉన్న వారు కాకుండా బంగ్లాదేశ్తో పాటు ఇతర పొరుగు దేశాలనుంచి అక్రమంగా వలస వచ్చి కొందరు ఉంటున్నారు. వారిని ఏరివేసేందుకు గాను కొత్త పౌరుల పేర్లను ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ పట్టికలో నమోదు చేస్తున్నారు. తాను భారత దేశంలోనే పుట్టినట్లు భారతీయుడే అని చెప్పేందుకు ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన ఏదైనా రుజువులు చూపిస్తే వారి పేర్లను ఎన్ఆర్సీలో నమోదు చేస్తోంది ప్రభుత్వం. అయితే ఈ ప్రక్రియను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013లో మొదలు పెట్టింది. అయితే ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల చేసిన నేపథ్యంలో చాలామంది పేర్లను వదిలివేయడం జరిగింది. దీనిపై కోర్టులో కూడా వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎన్ఆర్సీ ప్రక్రియను ఎందుకు వాయిదా వేయాలనుకుంటోంది..?
ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్రం తరపున వాదనలు వినిపించారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అస్సోం తరుపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. కేసును విచారణ చేస్తున్న ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ల ముందు తమ వాదనలను వినిపించారు. ప్రస్తుతం నేషనల్ రిజిస్టర్లో పేర్ల నమోదు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని వారు కోరారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ముగిసిన నాటినుంచి పోలింగ్ తర్వాత రెండు వారాలపాటు పేరునమోదు ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సీరియస్ అయ్యారు. ఇక దీన్ని తాత్సారం చేయడం కుదరదని ఎట్టి పరిస్థితుల్లో జూలై 31నాటికి పేర్ల నమోదు ప్రక్రియ పూర్తవ్వాల్సిందే అని జడ్జీలు పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు ఏమి చెప్పింది...?
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర బలగాలు అక్కడే విధుల్లో నిమగ్నమై ఉంటయి కాబట్టి ఎన్ఆర్సీ ప్రక్రియను పూర్తి చేయలేమన్నారు అటార్నీ జనరల్. దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వానికి బలమైన కోరిక ఉంటే వెయ్యిన్నొక్క మార్గాలున్నాయని ఇలా కాకుంటే కేంద్ర హోమ్శాఖకు సమన్లు జారీచేస్తామన్నారు. ఇదిలా ఉంటే ఈ సారి లోక్భ ఎన్నికలకు 2700 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమవుతుందని... దీనికోసం ఇప్పటికే అస్సాంలో ఉన్న 167 బలగాల కంపెనీలను వెనక్కు రప్పించాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు. అయినప్పటికీ కోర్టు సంతృప్తి చెందలేదు. లోక్సభ ఎన్నికలు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ప్రక్రియ రెండు ఒకేసారి నిర్వహించడంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో 31 జూలై 2019నాటికి పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేస్తూ కేసు విచారణను మార్చి మొదటి వారంకు వాయిదా వేసింది.