'లొంగకపోతే మావోలను నిర్ధాక్షిణ్యంగా కాల్చేయడమే', టాప్ టార్గెట్లో బాబు!
న్యూఢిల్లీ: తొలుత ఓ హెచ్చరిక.. కాదని బేఖాతరు చేస్తే నిర్దాక్షిణ్యంగా తెగబడటమే. నక్సల్స్ పట్ల మోడీ సర్కార్ తాజాగా ఇదే పంథాను అవలంభించాలని భావిస్తోంది. సుక్మా జిల్లాలో 25మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మావోలు హతమార్చడంపై కేంద్రం సీరియస్ గా ఫోకస్ చేసింది.
మావో శక్తిని పూర్తిగా అణిచివేసే దిశగా తాజాగా ఓ హిట్ లిస్టు సైతం తయారుచేసింది. దక్షిణ బస్తర్ డివిజనల్ కమాండర్ రఘు, జగర్ గుండ ఏరియా కమిటీ హెడ్ పాపారావు, ఫస్ట్ బెటాలియన్ ఆఫ్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్, సుక్మా దాడి వెనుక కీలక సూత్రధారిగా భావిస్తున్న మద్వి హిద్మాతో పాటు మావోయిస్టు అగ్రనేత ఆర్కే సహా తదితరులను ఈ హిట్ లిస్టులో చేర్చినట్లు తెలుస్తోంది.
ఏరివేతకు రంగం సిద్దం:
కేంద్రం ఆదేశాల మేరకు ఇకనుంచి ఈ హిట్ లిస్టులో ఉన్న మావోలే టార్గెట్ గా భద్రతా దళాలు కూంబింగ్ లు నిర్వహించనున్నాయి. విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని, వారాల పరిధిలోనే ఫలితం కనిపించాలని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ భద్రతా దళాలకు సూచించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు జైన్ మిలిషియాలో దాదాపు 10వేల నుంచి 12వేల మంది మావోలు ఉండటంతో.. వారిని కూడా ఏరివేయాలని కేంద్రం భావిస్తోంది.
లొంగకపోతే.. నిర్దాక్షిణ్యంగా కాల్చేయడమే:
మావోయిస్టులను టార్గెట్ చేసే సమయంలో.. తొలుత వారిని చుట్టుముట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నించాలని, ఒకవేళ లొంగబాటుకు ఒప్పుకోకపోతే మాత్రం నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ మేరకు గ్రౌ హౌండ్స్, సీఆర్పీఎఫ్, జవాన్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయని తెలుస్తోంది.
బస్తర్పై మెయిన్ ఫోకస్:
ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను సైతం వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బస్తర్ లో వివిధ కమిటీలకు చెందిన 200 నుంచి 250 మంది వరకు మావో నేతలు ఉన్నందునా.. తొలుత ఇక్కడే గట్టి ఫోకస్ పెట్టాలని కేంద్రం ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. బస్తర్ తో పాటు జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాలపై భద్రతా నిఘా కొనసాగనుంది.
మావోల టార్గెట్ చంద్రబాబు:
కేంద్రం తయారు చేసిన మావోల హిట్ లిస్టు సంగతి పక్కనపెడితే.. మావోయిస్టుల తమ హిట్ లిస్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తొలి టార్గెట్ గా ఎంచుకున్నట్లు కేంద్రానికి మరోసారి సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు చత్తీస్ ఘడ్ సీఎం రమణ్ సింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీ హెచ్.జె దొర కూడా వారి టార్గెట్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.