రైతుబంధు దేశానికి ఆదర్శం: ఏడాదికి రూ. 6వేలు ఇవ్వనున్న కేంద్రం
ఊహించిందే జరిగింది. ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న కేంద్రం రైతులకు తాయిలం ప్రకటించింది. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ మోడీ సర్కార్ బడ్జెట్లో రైతులకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఐదుఎకరాలు లేదా అంతలోపు భూమి ఉన్న వారికి వరాల జల్లు ప్రకటించింది మోడీ సర్కార్.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
అనుకున్నదే జరిగింది. ఎన్నికలకు ముందు రైతులకు వరాలు ప్రకటించింది మోడీ ప్రభుత్వం. తెలంగాణలో అమలువుతున్న రైతు బంధు పథకంను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రారంభమైన రైతు బంధు పథకంతోనే తిరిగి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇదే ఫార్ములాను ఒడిసి పట్టుకున్నట్లున్నారు మోడీ. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ఐదెకరాల లోపు ఉంటే ఏడాదికి రూ.6వేలు ఇవ్వనున్నారు.
రూ. 75వేల కోట్లు కేటాయింపు..మరి కౌలు రైతు పరిస్థితి ఏంటి..?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 75వేల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టింది. దీంతో 12కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అది కూడా మూడు వాయిదాల్లో చెల్లించనున్నారు. అంటే వాయిదాకు రూ. 2వేలు చెల్లిస్తారు. చిన్న సన్నకారు రైతులకు మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొచ్చినట్లు ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లోకి వెళుతుంది. ఇక్కడ కూడా రైతుబంధు పథకం కింద కౌలు రైతులకు ఎలా అయితే డబ్బులు ఇవ్వడం లేదో... కేంద్రం కూడా కౌలు రైతులపై క్లారిటీ ఇవ్వలేదు. అంటే కేంద్రం ప్రకటించిన పథకంలో కూడా స్పష్టత లేదు కాబట్టి కౌలు రైతుకు అన్యాయం జరిగిందనే భావించాల్సి ఉంటుంది.
కేసీఆర్కు దక్కిన క్రెడిట్
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు పథకంలో భూమి తమ పేర్లపై ఉన్న ప్రతిఒక్కరికీ ఎకరాకు రూ.8వేలు ఇవ్వడం జరుగుతోంది. అయితే ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ మరో రూ.2వేలు పెంచి దాన్ని రూ. 10వేలు చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. ఇక రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించిందని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు ఈ పథకం గురించి పలువురు కేంద్రమంత్రులు కూడా ఆరా తీసినట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు.
మొత్తానికి కేంద్రం రైతు సంక్షేమం కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు కేసీఆర్ రైతు బంధు పథకాన్నే మోడీ సర్కార్ కాపీ కొట్టిందని ఈ క్రెడిట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అయితే మరి కౌలు రైతుల పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకంగా మారింది.