కేబినెట్ కీలక నిర్ణయం: ఎయిరిండియాలో ఎన్నారైలూ 100శాతం వాటా పొందొచ్చు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు ఎన్నారైలకు కేంద్రం అనుమతిచ్చింది. ఎయిరిండియాలో వందశాతం వాటాలాను విక్రయించాలని ఇది వరకే నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Recommended Video
కేబినెట్ సమావేశం అనంతరం వివరాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. ఇది ఎస్ఓఈసీ నిబంధనల ఉల్లంఘనల కిందికి రాదని చెప్పారు. ఎన్నారై పెట్టుబడులను దేశీయ పెట్టుబడులుగానే భావిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నారైలకు 49శాతం వాటాలు కొనుగోలుకు మాత్రమే అవకాశం ఉందన్నారు.
విమానయాన రంగంలో ప్రభుత్వ అనుమతి మేరకు 49శాతం మేర మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ)కు అనుమతి ఉందని తెలిపారు. కాగా, కంపెనీల చట్టంలో మార్పులకూ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. 2013 నాటి చట్టంలో 72 మార్పులకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
చట్టంలో క్రిమినల్ నిబంధనలను డీక్రిమినలైజ్ చేయడం తమ ముఖ్య ఉద్దేశమని కేంద్రమంత్రి తెలిపారు. వివిధ సెక్షన్ల కింద జైలు శిక్ష, క్షమించదగిన నేరాలకు సంబంధించి పెనాల్టీ నిబంధనలను కూడా తొలగించనున్నట్లు మంత్రి తెలిపారు. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాలను కొనుగోలు చేసేందుకు పలు దేశీయ సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.