కేంద్రం కీలక నిర్ణయం: త్రివిధ దళాలకు ప్రత్యేక అధికారాలు, రూ. 500 కోట్ల నిధి
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో భారత రక్షణ దళాలకు ప్రత్యేక ఆర్థిక శక్తినిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 500 కోట్లలోపు అత్యాధునిక యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు వీలుగా త్రివిధ దళాలకు అధికారం ఇచ్చింది.
Recommended Video
షాకింగ్:బందీలుగా చిక్కిన చైనా సైనికులు.. 40మంది హతమయ్యారన్న కేంద్ర మంత్రి..
త్రివిధ దళాలకు ప్రత్యేక అధికారాలు
త్రివిధ దళాలకు ఆర్థికశక్తిని అందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యవసరాల నిమిత్తం రూ. 500 కోట్ల లోపు ఆయుధాలను కొనుగోలు చేయడం లేదా అప్గ్రేడ్ చేసుకునేలా ప్రత్యేక అధికారాలను ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో నూతన, అత్యాధునిక ఆయుధాలకు కొనుగోలు చేసే వీలు కలుగుతుందన్నారు.
సరికొత్త ఆయుధాల కోసం..
కాగా, ఈ నిధులతో ఆర్మీ సరికొత్త ఆయుధాలను సమకూర్చుకోనుంది. త్రివిధ దళాలు ఇప్పటికే ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయాలన్న విషయంపై కసరత్తులు ప్రారంభించాయి. కొనుగోలు చేయాల్సిన ఆయుధాల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి.
చైనా తోక జాడిస్తే..
ఇది ఇలావుండగా, సరిహద్దులో ఘర్షణలో నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నావికా దళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, వాయుసేనాధిపతి చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చైనా సైన్యం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడిన ధీటుగా జవాబివ్వాలని రాజ్ నాథ్ ఆదేశించారు. అంతేగాక, అసాధారణ పరిస్థితులతో తుపాకులను వాడేందుకు కూడా అనుమతిచ్చారు.
చైనాకు తగిన గుణపాఠం తప్పదు..
గత కొద్ది రోజుల సరిహద్దులో గాల్వన్ లోయ వద్ద చైనా దళాలు భారత దళాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. భారత దళాల ప్రతిదాడిలో సుమారు 45 మందికిపైగా చైనా సైనికులు హతమయ్యారు. అయితే, దీనిపై చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ ఘర్షణ తర్వాత చైనా దుస్సాహసాన్ని భారత్ ఎండగట్టింది. తాము శాంతినే కోరుకుంటున్నామని, అయితే, దాడులకు దిగితే మాత్రం తగిన గుణపాఠం చెప్పే సామర్థ్యం తమకు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చైనాను గట్టిగా హెచ్చరించారు.