సుప్రీంకోర్టు కొత్త జడ్జిల నియామకానికి గ్రీన్ సిగ్నల్?
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నలుగురు జడ్జిల నియామకాలకు సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. రాష్ట్రపతి సంతకం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువనడనుంది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లు సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమోషన్ పొందనున్నారు.
కొలీజియం పంపిన లిస్టులో ఉన్న జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు ప్రమోషన్ ప్రతిపాదనలను కేంద్రం ప్రభుత్వం గతంలో తిరస్కరించింది. సీనియారిటీ, ప్రాంతీయతను కారణాలుగా చూపుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే వీరిద్దరి సమర్థత, నడవడిక విషయంలో ఎలాంటి ప్రతికూలత లేదని కొలీజియం మళ్లీ వారి పేర్లను ప్రతిపాదించడంతో కేంద్రం మెట్టు దిగిరాక తప్పలేదు. ప్రస్తుతం జస్టిస్ బోస్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, జస్టిస్ బోపన్న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేస్తున్నారు. జస్టిస్ గవాయ్ బోంబే హైకోర్టు జడ్జిగానూ, జస్టిస్ కాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పని చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సహా 31మంది న్యాయమూర్తులు నియమించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 27 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. తాజాగా నలుగురి నియామకంతో నిబంధనల మేరకు న్యాయమూర్తులను నియమించినట్లవుతుంది.