లోక్సభలో మరో మూడు కొత్త బిల్లులు... కార్మిక హక్కులను హరించేందుకేనని విపక్షాల విమర్శలు...
విపక్షాల ఆందోళన నడుమ కార్మిక చట్టాలకు సంబంధించి మూడు కొత్త బిల్లులను శనివారం(సెప్టెంబర్ 19) కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిలో వృత్తిపరమైన భద్రత-హెల్త్&వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020,ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020,సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 బిల్లులు ఉన్నాయి.
గత ఏడాది ప్రవేశపెట్టిన మూడు బిల్లులను ఉపసంహరించుకుని వాటి స్థానంలో ఈ కొత్త బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులతో పాటు గత ఏడాది చట్ట రూపం దాల్చిన వేతన బిల్లు కోడ్-2019లో మొత్తం 29 కార్మిక చట్టాలను విలీనం చేసినట్లు తెలిపారు. ఈ బిల్లుల రూపకల్పన కోసం చాలా కసరత్తు చేశామని,దీనికి సంబంధించి ఆన్లైన్ ద్వారా దాదాపు 6వేల కామెంట్లను పరిశీలించామని చెప్పారు.అనంతరం ఈ మూడు బిల్లులను స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించగా... మొత్తం 233 ప్రతిపాదనల్లో 174కి ఆమోదం లభించిందన్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారీ,శశి థరూర్ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించారు. మనీష్ తివారీ మాట్లాడుతూ... మునుపటి మూడు బిల్లుల ప్రాథమిక స్వరూపాన్ని మార్చి ఈ కొత్త బిల్లులను తెచ్చారని అన్నారు. కేంద్రం ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని... లోక్సభలో వీటిని ప్రవేశపెట్టడానికి ముందు విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బిల్లుల కార్మికుల హక్కును తుడిచిపెడుతాయని పేర్కొన్నారు.
ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ... కేంద్రం ప్రవేశపెట్టిన వృత్తిపరమైన భద్రత-హెల్త్&వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 బిల్లులో అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు నిర్దిష్టమైన నిబంధనలేవీ అన్నారు. అంతరాష్ట్ర వలస కార్మికులకు సంబంధించి ప్రత్యేక చాప్టర్ ఏదీ లేదన్నారు. అసలు మహిళల గురించి పట్టించుకోని ఈ బిల్లులు వారి పట్ల వివక్షకు నిదర్శనమన్నారు.
Recommended Video
ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 బిల్లుతో కార్మికుల హక్కులకు భంగం కలుగుతుందన్నారు. ఇది కార్మికుల సమ్మె హక్కును తీవ్రంగా పరిమితం చేస్తుందని అన్నారు. సీపీఐ(ఎం) సభ్యుడు ఎం షరీఫ్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించారు. బిల్లులను స్టాండింగ్ కమిటీకి పంపించాలన్నారు.