మే 17 నుంచి విమాన సర్వీసులు ? ప్రైవేట్ ఎయిర్ లైన్స్ తో కేంద్రం చర్చలు..
కేంద్రం పొడిగించిన లాక్ డౌన్ గడువు మే 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రైవేటు వాణిజ్య విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు ఎయిర్ లైనర్స్ తో కేంద్రం చర్చలు జరుపుతోంది. తద్వారా వారి సన్నద్ధతను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. విడతల వారీగా విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది.
Recommended Video
మే 17 నుంచి విమాన సర్వీసులు...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుంచి దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. అయితే లాక్ డౌన్ విధించి నెలన్నర రోజులు గడిచిపోవడం, ఆర్ధిక వ్యవస్ధతో పాటు పలు రంగాలు గాడి తప్పుతున్న సంకేతాలతో కేంద్రం అప్రమత్తమవుతోంది. దీంతో పలు జాగ్రత్తలతో ఒక్కొక్కటిగా అన్ని రంగాలను తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మే 17న లాక్ డౌన్ ముగియగానే విమాన సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహలు చేస్తోంది.
ప్రైవేటు ఆపరేటర్లతో చర్చలు...
దేశీయ విమానయాన రంగంలో ప్రభుత్వ రంగం కంటే అధిక ప్రభావం చూపుతున్న ప్రైవేటు కమర్షియల్ ఫ్లైట్ ఆపరేటర్లే ఇందులో కీలకం. అందుకే ముందుగా వారి సన్నద్దతను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఆపరేటర్లతో చర్చలు జరుపుతోంది. మే 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తే ఎన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకురాగరన్న దానిపై ఓ అంచనాకు రావాలని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఫ్లైట్లతో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైనా చర్చిస్తోంది. అయితే సామాజిక దూరం నిబందన నేపథ్యంలో పాసింజర్లపై ఛార్జీల భారం పెంచక తప్పదనే వాదన ఆపరేటర్ల నుంచి వినిపిస్తోంది. అయినాఇందులో రాజీపడేది లేదని ఆరోగ్యశాఖ చెబుతోంది.
తగ్గిన విమాన ఇంధన ధరలూ కారణమే...
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన రంగ సంక్షోభం కారణంగా ప్రస్తుతం మన దేశంలోనూ విమానాలకు వాడే ఇంధన ధరలు ఎన్నడూ లేనంత స్ధాయిలో తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఇవి డీజిల్, పెట్రోల్ కంటే తక్కువకు క్షీణించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ పరిస్ధితిని సద్వినియోగం చేసుకుని మళ్లీ పౌరవిమానయాన రంగాన్ని గాడిన పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా నష్టాలతో కుదేలైన ప్రభుత్వ విమానయాన సంస్ధలను గట్టెక్కించాలంటే ప్రస్తుత సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోక తప్పని పరిస్ధితి కనిపిస్తోంది.
ముందు దేశీయం, తర్వాత అంతర్జాతీయం..
మే 17న లాక్ డౌన్ ముగియగానే విమాన యాన సర్వీసులను పునరుద్దరించనున్న కేంద్రం... తొలుత దేశీయ విమానయాన సర్వీసులను నడిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ తర్వాత పరిస్దితిని బట్టి కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉండే దేశాలకు సర్వీసులు నడపనుంది. అలాగే విదేశీ సర్వీసులను కూడా ఇదే ప్రాతిపదికన దేశంలోకి అనుమతించాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై మరింత కసరత్తు అవసరమని పౌరవిమానయాన శాఖ భావిస్తోంది. మరోవైపు కేంద్రం రూపొందిస్తున్న ప్రతిపాదనలను ప్రధాని మోడీ ఆమోదించాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.