హోం క్వారంటైన్ నిబంధనల్లో కేంద్రం మార్పులు -ఎయిడ్స్, క్యాన్సర్ రోగులకు నో- కొత్త మార్గదర్శకాలు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన మార్గదర్శకాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్న కేంద్రం... తాజాగా పలు కీలక మార్పులు చేస్తూ తాజా ప్రకటన చేసింది. ఇందులో ఇప్పటివరకూ వీఐపీలతో పాటు పలువురు సాధారణ రోగులకూ ఇస్తున్న హోం క్వారంటైన్ ఆప్షన్ లో భారీ మార్పులు చేసింది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల నిరోధంలో భాగంగానే కేంద్రం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇక వారికి నో హోం క్వారంటైన్....
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో హోం క్వారంటైన్ నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఇకపై ప్రాణాంతక రోగాలతో బాధపడుతున్న వారికి హోం క్వారంటైన్ ను రద్దు చేశారు. వీరు ఇకపై కరోనా లక్షణాలు కనిపిస్తూ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాల్సింది. కేంద్రం తాజాగా హోం క్వారంటైన్ రద్దు చేసిన వారిలో ఎయిడ్స్ సోకిన వారు, క్యాన్సర్ థెరపీ తీసుకుంటున్న వారు, ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న వారికి ఇకపై హోం క్వారంటైన్ అవకాశం ఇవ్వబోమని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఆ రోగులకూ, వయోవృద్ధులకూ...
అయితే కేంద్రం తాజా మార్గదర్శకాల్లో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు, హైపర్ టెన్షన్, షుగర్, గుండెజబ్బులు, లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రం డాక్టర్ల సూచనపై హోం క్వారంటైన్ పొందే అవకాశం కల్పించారు. అయితే వీరికి కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవని డాక్టర్లు నిర్ధారిస్తేనే హోం క్వారంటైన్ అవకాశం ఉంటుంది. లేకపోతే వీరు కూడా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిందనని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో ఓసారి కరోనా వచ్చి తగ్గిన తర్వాత లక్షణాలు కనిపించని వారు కూడా తమకు హోం క్వారంటైన్ కావాలని కోరవచ్చని కేంద్రం తెలిపింది.
హోం క్వారంటైన్ డిశ్చార్జ్...
హోం క్వారంటైన్లో ఉన్న వారికి మూడు రోజుల పాటు ఎలాంటి జ్వరం లేకపోతే, పది రోజుల చికిత్స తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపించకపోతేనే డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించాలని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో సూచించింది. పది రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినా మరో వారం రోజుల పాటు వారిని స్వయం నియంత్రణ పాటించేలా చూడాలని ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఇలా హోం క్వారంటైన్లో ఉన్న వారిపై 24 గంటలూ ఒక కేర్ టేకర్ ను ఉంచాలని, వారు ఆస్పత్రులో టచ్ లో ఉండాలని కేంద్రం సూచించింది.
హోం క్వారంటైన్లపై మరింత దృష్టి...
ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోం క్వారంటైన్ పేషెంట్లపై మరింత దృష్టి పెట్టాలని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాగాన్ని మరింత అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. కరోనా లక్షణాల కారణంగా శ్వాస ఆడకపోయినట్లయితే సదరు రోగులకు వెంటనే చికిత్స అందించేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఫీల్డ్ స్టాప్ కూడా హోం క్వారంటైన్ రోగుల తాజా పరిస్దితిని ఎప్పటికప్పుడు కోవిడ్ 19 వెబ్ సైట్లో అప్ డేట్ చేయాలని ఆదేశించింది.