మీ ట్విట్టర్ ఖాతా సురక్షితమేనా ? గ్లోబల్ హ్యాక్ బారిన భారతీయ అకౌంట్లు.. కేంద్రం నోటీసులు..
బిట్ కాయిన్ స్కామ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా హై ప్రొఫైల్ వ్యక్తుల, సంస్ధల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ట్విట్టర్ కు నకిలీ లింక్స్, ట్వీట్స్ పంపడం ద్వారా వేల సంఖ్యలో వీఐపీల అకౌంట్లను హ్యాక్ చేసినట్లు తాజాగా తేలింది. వీరిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమోక్రాట్స్ తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బిడెన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వంటి వారు ఉన్నారు. ఈ జాబితాలో భారత్ కు చెందిన వారు ఉన్నారో లేదో ఇంకా తెలియరాలేదు. దీంతో కేంద్రం కూడా ఆందోళన చెందుతోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెర్ట్ రంగంలోకి దిగింది. హ్యాకర్లు ఏయే వీఐపీ అకౌంట్లను హ్యాక్ చేసి ట్విట్టర్ సిస్టమ్స్ యాక్సెస్ పొందారన్న అంశంపై దర్యాప్తు జరుపుతోంది. అదే సమయంలో ఈ గ్లోబల్ హ్యాక్ కు సంబంధించిన పూర్తి వివరాలు తమతో పంచుకోవాలని ట్విట్టర్ కు సెర్ట్ నోటీసులు జారీ చేసింది. ఈ వివరాలు అందితే కానీ మన దేశంలో ఎవరి అకౌంట్లు హ్యాక్ కు గురయ్యాయో తెలియదు. అదే సమయంలో హ్యాకింగ్ ను బ్రేక్ చేసేందుకు ట్విట్టర్ ఎలాంటి చర్యలు చేపట్టిందో వివరించాల్సిందిగా కూడా కోరింది. దీనిపై ట్విట్టర్ ఇంకా స్పందించాల్సి ఉంది.