మారిన మోడీ స్వరం: ఇక స్మార్ట్ లాక్డౌన్ దిశగా: మూడు జోన్లుగా: నేడు ప్రకటించే ఛాన్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న 21 రోజుల లాక్డౌన్.. మరో 48 గంటల్లో ముగియబోతోంది. మంగళవారం నాటితో ఈ లాక్డౌన్ ముగుస్తోంది. ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితులను మరి కొద్దిరోజుల పాటు పొడిగించాలంటూ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఙప్తి చేశారు. తమకు తాముగా స్వచ్ఛదంగా ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాయి.
Recommended Video
జోన్ల వ్యవస్థ..
కరోనా వైరస్ తీవ్రత పెద్దగా లేని ప్రాంతాల్లో లాక్డౌన్ను సడలించాలంటూ మరి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి సూచించారు. కరోనా తీవ్రతను గుర్తించడానికి జోన్ల వ్యవస్థను అనుసరించాలని కోరారు. తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలను లాక్డౌన్ నుంచి మినహాయించాలని విజ్ఙప్తి చేశారు. దీన్ని గుర్తించడానికి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలనే సరికొత్త ప్రతిపాదనను ప్రధాని ముందు ఉంచారు. తాజాగా- ఈ జోన్ల వ్యవస్థ వైపే ప్రధాని మోడీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
తీవ్రత లేని ప్రాంతాల్లో స్మార్ట్ లాక్డౌన్..
ఈ జోన్ల వ్యవస్థ వల్ల ఏ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉందో, లేదా తక్కువ స్థాయిలో ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి వీలు ఉంటుందని, దీనికి అనుగుణంగా లాక్డౌన్ను సడలించడమో లేక మరింత కట్టుదిట్టం చేయడానికి అవకాశం ఉంటుందని కేంద్రం ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు లేని దాదాపు 400 జిల్లాలు ఉన్నాయని, వాటిని గ్రీన్ జోన్ పరిధిలోకి తీసుకుని వచ్చి.. స్మార్ట్ లాక్డౌన్ను అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆరెంజ్ జోన్ ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో ప్రజారవాణా, వ్యవసాయ పనులకు ఆటంకం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రెడ్ జోన్లు, హాట్స్పాట్లకే పరిమతం..
15 కేసుల కంటే అధికంగా ఉండే ప్రాంతాలను రెడ్ జోన్గా పరిగణిస్తారని, ఆ ప్రాంతాల్లో ఎలాంటి కార్యకలా పాలను కూడా అనుమతించే అవకాశం ఉండదనే అంటున్నారు. ఫలితంగా- రెండో విడత లాక్డౌన్ నుంచి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా తీవ్రత లేని ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగడం ఆర్థికంగా ఇబ్బందులు తీరుతాయని అంటున్నారు.
నేడు అధికారికంగా ప్రకటన..
లాక్డౌన్ గడువు ముగుస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ను యధాతథంగా అమలు చేయడమా? లేక మూడు రంగుల విధానాన్ని తెర మీదికి తీసుకుని వచ్చి, స్మార్ట్ లాక్డౌన్ను ప్రకటించడమా? అనేది మరి కొన్ని గంటల్లో స్పష్టం కావచ్చని చెబుతున్నారు. ప్రధాని జాతిని ఉద్దేశించిన ప్రసంగించే సమయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.