జమ్మూకశ్మీర్కు తిరిగి ఆ హోదా ఇవ్వనున్న కేంద్రం?-అఖిలపక్ష సమావేశంలో చర్చించే ఛాన్స్...
రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను రద్దు చేసిన కేంద్రం... తిరిగి దాన్ని పునరుద్దరించే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నెల 24న జమ్మూకశ్మీర్ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. సరైన సందర్భంలో కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని గతంలో ప్రకటించిన కేంద్రం... ఇప్పుడా దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అఖిలపక్ష సమావేశంలో మోదీ ఏం చర్చిస్తారు
జాతీయ మీడియా కథనాల ప్రకారం... జమ్మూకశ్మీర్కు ఇప్పుడున్న కేంద్రపాలిత ప్రాంతం హోదాను రద్దు చేసి తిరిగి రాష్ట్ర హోదాను కట్టబెట్టేందుకు కేంద్రం మొగ్గుచూపుతోంది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశం మాత్రం లేదు. అఖిలపక్ష సమావేశంలో జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాతో పాటు,అక్కడ ఎన్నికలు నిర్వహించే అంశంపై ప్రధాని మోదీ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు,కేవలం నియోజకవర్గాల డీలిమిటేషన్ లేదా నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రమే ఇందులో చర్చించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి...
అగస్టు,2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు ముగింపు పలికేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న మొదటి ప్రయత్నమిది. జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని,అక్కడ ఎన్నికలు నిర్వహించాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో భారత్పై ఒత్తిడి తెస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది నెలలుగా జమ్మూకశ్మీర్ అంశంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కశ్మీర్ లోయలోని వేర్పాటు వాదులతోనూ ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై...
రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లదాఖ్ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకూ జమ్మూకశ్మీర్లో ఎన్నికలు జరగలేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిర్బంధాన్ని ఎదుర్కొన్న జమ్మూకశ్మీర్ నేతలు కొద్ది నెలల క్రితమే దాని నుంచి విముక్తి చెందారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అంశంపై ప్రధాని మోదీ అక్కడి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పీఏజీడీ(గుప్కార్ కూటమి) 110 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. 75 సీట్లు గెలుచుకున్న బీజేపీ అత్యధిక సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Recommended Video
దోవల్తో అమిత్ షా చర్చలు...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం(జూన్ 18) జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో సమావేశమైన సంగతి తెలిసిందే. కశ్మీర్లో పరిస్థితులను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. కశ్మీర్ను అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే తమ తొలి ప్రాధాన్యత అని వారితో సమావేశంలో అమిత్ షా పేర్కొన్నారు.జమ్మూకశ్మీర్లో కేంద్ర పథకాలు 90శాతం మందికి అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 24న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంపై కూడా అమిత్ షా వారితో చర్చించినట్లు తెలుస్తోంది.