Nirbhaya case: దోషుల ఉరిశిక్ష అమలుకు సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్
Recommended Video
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిర్భయ హత్యాచారం కేసులో దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేను ఎత్తివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నలుగురు దోషులను వేర్వేరుగా ఉరితీయడం కుదరదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. స్టే యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. అయితే, వారంలోగా దోషులు తమకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలనూ వినియోగించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రంతోపాట ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
నిర్భయ కేసులో దోషులైన ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ను జనవరి 22నే ఉరితీయాల్సిం ఉండగా.. ముకేష్ క్షమాభిక్ష పిటిషన్ అభ్యర్థన పెట్టుకోవడంతో తొలుత శిక్ష అమలు వాయిదా పడింది. ఆ తర్వాత అతడి క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాలని ఢిల్లీ ట్రయల్ కోర్టు రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసింది.
అయితే, శిక్ష అమలుకు రెండు రోజుల ముందు దోషులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలున్నాయని, అప్పటి వరకు ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు.. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు శిక్ష అమలుపై స్టే విధిస్తూ జనవరి 31న తీర్పు వెలురించింది. దీంతో దోషుల ఉరి మరోసారి వాయిదా పడింది.
ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే దోషులను వేర్వేరుగా ఉరితీసేందుకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కేంద్రం. కాగా, ఢిల్లీ హైకోర్టు నిర్భయ దోషులకు వారం రోజులే గడువు ఇవ్వడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది నిర్భయ తల్లి ఆశాదేవి. అయితే, దోషులకు ఉరిశిక్ష అమలైనప్పుడే తనకు ఆనందం లభిస్తుందని అన్నారు. అప్పుడే తన కూతురుకు న్యాయం జరిగినట్లయితువుందని తెలిపారు. 2012లో నిర్భయను ఆరుగురు నిందితులు అత్యాచారం చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే.