క్యా బాత్ హై:అల్లర్లపై అర్ధరాత్రి విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ట్రాన్స్ఫర్..24 గంటల్లోనే!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న అల్లర్లకు సంబంధించిన పిటీషన్పై అర్ధరాత్రి తన నివాసంలో విచారణ చేపట్టి, సత్వర ఆదేశాలను జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు పంపించారు. దీనికి సంబంధించిన గెజిట్పై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
Recommended Video
Delhi
riots:
అల్లర్లపై
అర్ధరాత్రి
ఢిల్లీ
హైకోర్టు
జడ్జి
నివాసంలో
విచారణ:
పోలీసులకు
కీలక
ఆదేశాలు..
!
గాయపడ్డ వారిని మెరుగైన ఆసుపత్రికి తరలించడానికి
అల్లర్లతో అట్టుడికిపోతున్న జఫ్రాబాద్, మౌజ్పూర్, యమునా విహార్, చాంద్పూర్ ప్రాంతాల్లో గాయపడ్డ వారిని మెరుగైన వైద్య చికిత్స అందించడానికి ఉద్దేశించిన పిటీషన్ అది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించడానికి వీలు కల్పించాలని, దారి వదిలేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలంటూ కొందరు డాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్పై బుధవారం తెల్లవారు జామున 1:42 నిమిషాలకు జస్టిస్ ఎస్ మురళీధర్ తన అధికారిక నివాసంలో మరో న్యాయమూర్తి జస్టిస్ భంభానితో ఈ విచారణ చేపట్టారు.
వాహనాలను అడ్డుకోవద్దంటూ ఆదేశాలు..
ఒక వర్గానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించడాన్ని అడ్డుకోవద్దని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అవసరమైతే క్షతగాత్రుల తరలింపులో సహకరించాలని కూడా సూచించారు. ఢిల్లీ పోలీసులకు కొన్ని కీలక సూచలను సూచిస్తూ మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించారు. ఈ విచారణ చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే ఎస్ మురళీధర్ బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరిచుకుంది.
1984 నాటి పరిస్థితులు పునరావృతం కానివ్వొద్దంటూ..
అల్లర్లపై ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్భంగా కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో 1984- సిక్కుల ఊచకోత వంటి పరిస్థితులు పునరావృతం కానివ్వొద్దంటూ ఆయన సూచించారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని, సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు.
బీజేపీ నేతలపైనా
విచారణ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నాయకులపైనా ఎస్ మురళీధర్ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు అదుపు తప్పిన సమయంలో ఆలోచించి మాటలను సంధించాల్సి ఉంటుందని ఆయన కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, అభయ్ వర్మ, పర్వేష్ వర్మ వంటి బీజేపీ నాయకులను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల మధ్య ఎస్ మురళీధర్ ఆకస్మికంగా బదిలీ కావడం చర్చనీయాంశమైంది. కొలీజియం ఇదివరకే ఆయన బదిలీకి సిఫారసు చేయగా దాన్ని కేంద్రం తాజాగా నోటిఫై చేసింది.