మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ- సోషల్ మీడియాలో బ్యాన్ చేసిన కేంద్రం ! ఎక్కడా కనిపించొద్దు !
ప్రధాని మోడీకి గుజరాత్ అల్లర్లకు ఉన్న సంబంధం గురించి బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎప్పుడో జరిగిపోయిన అల్లర్లపై సుప్రీంకోర్టు కూడాతీర్పు ఇచ్చేసిన నేపథ్యంలో దాన్ని వివాదాస్పదం చేసేందుకే బీబీసీ ఉద్దేశపూర్వకంగా ఈ డాక్యుమెంటరీ రూపొందించిందని భావిస్తున్న కేంద్రం.. దానిపై ఆంక్షలకు తెరలేపింది.
ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై కనిపించనివ్వకుండా చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియోలు, ట్వీట్లు, వార్తలు తీసేయాలని కేంద్రం సోషల్ మీడియా దిగ్గజాలను ఇవాళ ఆదేశించింది. దీంతో ఆయా సంస్ధలు ఇప్పుడు వాటిని తొలగించే పనిలో ఉన్నాయి.
గుజరాత్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన బీబీసీ డాక్యుమెంటరీ లింక్లను తీసివేయాలని కేంద్రం ట్విట్టర్ మరియు యూట్యూబ్లను ఆదేశించిందని సంబంధిత వర్గాలు ప్రకటించాయి. కేంద్రం ఆదేశాల ప్రకారం "ఇండియా: ది మోడీ క్వశ్చన్" అనే డాక్యుమెంటరీకి సంబంధించిన అనేక ట్వీట్లు మరియు యూట్యూబ్ వీడియోలు ఇకపై మైక్రోబ్లాగింగ్ మరియు వీడియో-షేరింగ్ వెబ్సైట్లలో కనిపించవని తెలుస్తోంది. బీబీసీ ద్వారా డాక్యుమెంటరీ యొక్క మొదటి ఎపిసోడ్ను బ్లాక్ చేయమని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ రెండు సోషల్ మీడియా దిగ్గజాలకు ఇప్పటికే చెప్పింది. బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం ఇప్పటికే తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తన స్పందనను నేరుగా బీబీసీకే తెలియచేసింది. అయితే బీబీసీ కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది.
మోదీపై తీసిన డాక్యుమెంటరీని బీబీసీ సమర్ధించుకుంది. చాలా లోతుగా అధ్యయనం చేసి ఆ డాక్యుమెంటరీ తీసినట్లు బీబీసీ వార్తాసంస్ధ తెలిపింది. అయితే ఆ డాక్యుమెంటరీలో నిష్పాక్షికత లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గుజరాత్ అల్లర్లలో మోదీ హస్తం ఉన్న విషయం బ్రిటన్ ప్రభుత్వానికి తెలుసంటూ బీబీసీ తన కథనంలో పేర్కొంది. అయితే దీన్ని ఇప్పటికే బ్రిటన్ లోని రుషి సునాక్ సర్కార్ ఖండించింది.