ఇక ప్రైవేటుకు రైల్వేస్టేషన్లు- త్వరలో వేలం - అందంగా తయారు చేసి మరీ....
ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగులు కలిగిన సంస్ధగా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ రైల్వేలో పెను మార్పులకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. మిగిలిన ప్రభుత్వ రంగ సంస్ధలతో పోలిస్తే రైల్వేకూ ఎలాంటి మినహాయింపులు ఉండబోవని కేంద్రం తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. రైల్వేల్లో ప్రైవేటీకరణకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం... తాజాగా 151 రైళ్లను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైంది. అంతటితో ఆగకుండా ఇప్పుడు రైల్వే స్టేషన్లను సైతం ప్రైవేటు సంస్ధలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ముందుగా వీటి రూపురేఖలను మార్చబోతోంది.
త్వరలో రైల్వే స్టేషన్ల వేలం..
దేశవ్యాప్తంగా రైల్వేల ప్రైవేటీకరణ ప్రక్రియ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది నుంచే ఇందుకోసం పక్కా ప్రణాళిక తయారు చేసుకున్న కేంద్రం దాన్ని క్రమంగా అమల్లో పెడుతోంది. ఇప్పటికే దేశంలోని 109 మార్గాల్లో 151 ప్రైవేట్ రైళ్లను తిప్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేటుకు అప్పగించే దిశగా పావులు కదుపుతోంది. అంటే ఇకపై రైళ్లతో పాటు స్టేషన్లు కూడా ప్రైవేటు వ్యక్తుల, సంస్ధల చేతుల్లోకి వెళ్లబోతున్నాయన్నమాట. కార్మిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ముస్తాబు చేసి మరీ వేలం...
తొలి దశలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రైల్వేస్టేషన్లను ప్రైవేటుకు అప్పగించేందుకు వీలుగా కేంద్రం వేలం నిర్వహించబోతోంది. అంతకంటే ముందు వీటిలో పూర్తిగా రూపురేఖలు మార్చబోతోంది. ఆధునీకీకరణ తర్వాత ఆయా స్టేషన్లకు వేలం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అంటే అందంగా ముస్తాబు చేసి మరీ అమ్మేయడం అన్నమాట. తద్వారా వీటికి మరింత ఎక్కువ ధర వచ్చేలా చూసుకోవడం. గతంలో మనం వాడే టూ వీలరో లేక కారో అమ్మాలనుకున్నప్పుడు దానికి అవసరమైన రిపేర్లు చేయించి అమ్మకోవడం ఎలాగో ఇప్పుడు కేంద్రం కూడా అలాగే వ్యవహరిస్తోంది. దీనికి కార్పోరేటీకరణ పదాన్ని వాడుతోంది.
ఏయే రైల్వేస్టేషన్లు...
దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల వేలానికి సిద్ధమవుతున్న కేంద్రం ముందుగా భారీ డిమాండ్ కలిగిన సిటీ రైల్వేస్టేషన్లను ఎంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వీటిలో ఇప్పటికే పలు సదుపాయాలు కల్పించారు. వీటిని స్వల్ప ఖర్చుతో మరింత మెరుగ్గా తీర్చిదిద్ది తొలిదశలో కనీసం 100 స్టేషన్లను వేలం వేస్తే ఎలా ఉంటుందని కేంద్రం ఆలోచిస్తోంది. ఆ తర్వాత వీటి ఫలితాల ఆధారంగా మరికొన్ని స్టేషన్లను వేలం వేస్తారు. చివరిగా డిమాండ్ ఆధారంగా మిగిలిన స్టేషన్లపై దృష్టిసారిస్తారు. వచ్చే ఐదేళ్లలో రైల్వేల్లో ప్రైవేటీకరణ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ద్విముఖ వ్యూహం...
దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్ల వేలానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న కేంద్రం... ప్రైవేటు రంగం రాకతో ఆయా స్టేషన్లలో విమానాశ్రయాల తరహాలో మరింత మెరుగైన సదుపాయాలు లభిస్తాయని చెబుతోంది. ఇప్పటికే విమానాశ్రయాల్లో కార్పోరేట్ సదుపాయాలు, వసతుల కల్పనతో పాటు ప్రైవేటు ఏజెన్సీల రాకతో ప్రయాణికులకు సకల సౌకర్యాలు లభిస్తున్నాయి. ఇదే విధంగా రైల్వేల్లోనూ ప్రయాణికులకు అంతిమంగా లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. తన చేతికి మట్టి అంటకుండా కోట్లు కురిపించే మంత్రం కావడంతో ప్రైవేటీకరణను కేంద్రం ద్విముఖ వ్యూహంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడక్కడా అభ్యంతరాలు ఉన్నా అంతిమంగా ప్రయాణికులు దీన్ని స్వాగతిస్తే మిగతా విషయాలు చిన్నవి అయిపోతాయనే అంచనాలతో కేంద్రం ఉన్నట్లు కనిపిస్తోంది.