సీఆర్పీఎఫ్ అమర జవాన్ల పార్థివ దేహాలపై ఓట్లను ఏరుకుంటున్నారా? కేంద్రంపై మమతా బెనర్జీ ఆగ్రహం
కోల్ కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రప్రభుత్వంపై తుపాకీ ఎక్కు పెట్టారు. బుల్లెట్ లాంటి విమర్శలను సంధించారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. భారతీయ జనతాపార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి అనేక కుట్రలు పన్నుతోందని విమర్శించారు. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి నుంచి కూడా ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల పార్థివ దేహాలపై ఓట్లను ఏరుకోవడానికి సిద్ధపడిందని మండిపడ్డారు. సోమవారం ఆమె కోల్ కతలో ఏర్పాటైన తృణమూల్ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడారు.
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాదుల దాడిని కేంద్రంగా చేసుకుని బీజేపీపై మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు పెను దాడులకు దిగే అవకాశం ఉందని అంటూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు వారం రోజుల కిందటే కేంద్రానికి సమాచారం ఇచ్చారని అన్నారు. అయినప్పటికీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలను తీసుకోలేదని చెప్పారు. ఉగ్రవాదులు దాడులు చేస్తే, పెద్ద ఎత్తున ప్రాణనష్టం చోటు చేసుకుంటుందని, దీని ద్వారా రాజకీయ లబ్దిని పొందాలని బీజేపీ వ్యూహం అని విమర్శించారు.
దీనికి అనుగుణంగా పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారని చెప్పారు. కేంద్రం వైఫల్యం కారణంగానే ఈ దాడి చోటు చేసుకుందని అన్నారు. ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిన వెంటనే ఏ మాత్రం అప్రమత్తమైనా ఉగ్రదాడి జరిగేది కాదని మమతా బెనర్జీ చెప్పారు. ఎన్నికల సమయంలో దేశంలో అశాంతికి తెర లేపి, దాన్ని సాకుగా చూపి, సుస్థిర ప్రభుత్వం అందిస్తామని ఆశ చూపి, ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పుల్వామా ఘటనకు ముందు కేంద్రం ఉద్దేశపూరకంగానే ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. అమర జవాన్ల పార్థివ దేహాలను అడ్డుగా పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగవచ్చని భావించిందని అన్నారు. ఇద్దరు సోదరులు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆమె నరేంద్రమోడీ-అమిత్ షాను ఉద్దేశించి విమర్శించారు. ఎన్నికలకు ముందు దేశంలో వార్ హిస్టీరియా వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు. నరేంద్రమోడీ నియంతలా మారిపోయారని, మరోసారి అధికారంలోకి రావడానికి ఎన్ని దారుణాలకైనా పాల్పడటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మోడీ హయాంలో దేశం అత్యంత దుర్భర పరిస్థితులను చవి చూస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లోని అన్ని (42) లోక్ సభ స్థానాలను గెలుచుకుని, బీజేపీకి బుద్ధి చెబుతామని అన్నారు. ఇదే లక్ష్యంతో పని చేయాలని ఆమె పార్టీ కార్యకర్తలను కోరారు. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వవద్దని చెప్పారు.