రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివరాలను వెల్లడించిన కేంద్రం
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్రం రియాక్ట్ అయ్యింది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సందర్భంగా నిర్ణయాలు ఎలా తీసుకున్నారో కోరుతూ తమకు తెలపాలని పిటిషన్ వేసిన పిటిషనర్లకు కేంద్రం తాము ఏ క్రమంలో నిర్ణయాలు తీసుకున్నామో వివరిస్తూ దానికి సంబంధించిన పత్రాలను అందజేశాయి.
పిటిషనర్లకు రాఫెల్ కొనుగోలు వివరాలను తెలిపిన కేంద్రం
36 రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం, ఆ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు తెలియజేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పిటిషనర్లకు డాక్యుమెంట్లు అందజేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణశాఖ నిబంధనలకు అనుగుణంగానే ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని డాక్యుమెంట్లలో పేర్కొంది కేంద్రం. యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఇండియన్ నెగోషియేటింగ్ టీమ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పిన కేంద్రం... ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒక ఏడాది పాటు చర్చలు జరిపినట్లు వెల్లడించింది. ఆ తర్వాత క్యాబినెట్ కమిటీ ముందుకు అప్రూవల్ కోసం వచ్చిందని చెప్పిన కేంద్రం.... క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలపగానే ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
నవంబర్ 14కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఇక రాఫెల్ యుద్ధ విమానంకు సంబంధించిన అన్ని అంశాలు అంటే... కొనుగోలు సందర్భంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో దేశ ప్రజలకు బహిర్గతం చేసేముందు పిటిషనర్లకు పూర్తి వివరాలు ఇవ్వాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాదు సీల్డ్ కవర్లో 36 రాఫెల్ జెట్ విమానాల ధరలను కూడా న్యాయస్థానం ముందు ఉంచాలని గట్టి ఆదేశాలు ఇచ్చింది. ఇక నవంబర్ 14కు విచారణ వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం... కోర్టుకు కూడా ధరల వివరాలు తెలపరాదని కేంద్రం భావిస్తే అదే విషయం పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది.
రాఫెల్ డీల్లో గోల్మాల్ జరిగింది: పిటిషనర్లు
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో గోల్మాల్ జరిగిందని ఆరోపిస్తూ వాటి వివరాలను దేశ ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయవాదులు మనోహర్ లాల్ శర్మ, వినీత్ దండాలు పిటిషన్ వేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా పిటిషన్ వేయడంతో వ్యవహారం వేడెక్కింది. ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు కూడా సంయుక్తంగా పిటిషన్ వేశారు. మొత్తం 9 పేజీలతో కూడిన నివేదికను పిటిషనర్లకు అందజేసింది కేంద్రం.