జగన్, కేసీఆర్ కు కేంద్రం మరో షాక్ - అన్నీ అపోహలే- అధికారాలు లాక్కోవడం లేదంటూనే...
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ను అవసరమైన సందర్భాల్లో వాడుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా ఇరుకున పెట్టే వ్యూహాన్ని కేంద్రం పక్కాగా అమలు చేస్తోంది. తాజాగా రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో సీఎంలు కేసీఆర్, జగన్ వ్యక్తం చేసిన అభ్యంతరాల విషయంలో మరోమారు ఇదే రుజువైంది. కేంద్రం వీటిని పట్టించుకోకుండా వీరివి ఒట్టి అపోహలే అంటూ కొట్టిపారేసింది. అంతేకాదు వీరి అధికారాలకు వచ్చిన ముప్పేమీ లేదంటూ కుందబద్దలు కొట్టింది. దీనిపై ఇప్పుడు ఇద్దరు సీఎంలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అసలేం జరిగిందంటే...
విద్యుత్ రంగ సంస్కరణల బిల్లు..
దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే 2003 నాటి విద్యుత్ చట్టంలో సమూల మార్పులు చేయడం ద్వారా భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా దాన్ని మార్చాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఇందులో పేర్కొన్న పలు అంశాలు రాష్ట్రాలకు ససేమిరా నచ్చలేదు. ప్రధానంగా ప్రైవేటీకరణకు దారి తీసేలా, వారి అధికారాలకు కత్తెర వేసేలా ఉన్న క్లాజులను ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటిపై కేంద్రం తయారు చేసిన ముసాయిదా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎంలు జగన్, కేసీఆర్ తమ అభ్యంతరాలను కేంద్రానికి పంపారు.
జగన్, కేసీఆర్ అభ్యంతరాల బేఖాతర్...
విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేంద్రం అసలు పట్టించుకోలేదు. ఈఆర్సీ పాలకమండలి ఎంపిక తప్ప మిగతా అంశాలపై ముందుకెళ్లేందుకే కేంద్రం సిద్ధమవుతోంది. విద్యుత్ ఒప్పందాలతో పాటు ప్రైవేటీ కరణ, అధికార కేంద్రీకరణ వంటి అంశాల్లో జగన్, కేసీఆర్ ప్రభుత్వాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోరాదని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యుత్ బిల్లు ఇరువురు సీఎంలకు షాక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వీరి అభ్యంతరాలను పట్టించుకోకపోవడంపై కేంద్రమంత్రి ఆర్కేసింగ్ తాజాగా వివరణ కూడా ఇచ్చారు.
నగదు బదిలీ, ఛార్జీలపై అన్నీ అపోహలేనంటూ...
వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు ఛార్జీలను తగ్గిస్తే ఆ మేర రాయితీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లోనే వేసే డీబీటీ విధానానికి కేంద్రం మొగ్గుచూపుతోంది. డీబీటీ ఖాతాలో రాయితీ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలు వేయకపోయినా మూడు నాలుగు నెలల పాటు కరెంటు సరఫరా నిలిపేయకుండా వెసులుబాటు ఇస్తామని మాత్రం కేంద్రం హామీ ఇస్తోంది. కాబట్టి డీబీటీ విధానంలో రాష్ట్రాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకే కేంద్రం సిద్ధమవుతోంది. అలాగే కరెంటు ఛార్జీలను నిర్ణయించే అధికారం కేంద్రానికి ఉండేలా ఈ చట్టంలో మార్పులుంటాయన్నది కేవలం అపోహ మాత్రమేనని కేంద్రమంత్రి ఆర్కేసింగ్ స్పష్టం చేశారు.
Recommended Video
జగన్, కేసీఆర్ తదుపరి వ్యూహం.. ?
విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, కేరళ వంటి ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకే కేంద్రం మొగ్గుచూపుతోంది. అదే జరిగితే జగన్ భావించినట్లు విద్యుత్ ఒప్పందాల సమీక్షతో పాటు మిగతా అంశాల్లోనూ రాష్ట్రాలకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. దీంతో విద్యుత్ చట్టంపై తదుపరి వ్యూహం ఖరారు కోసం ఏం చేయాలనే దానిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. అలాగని పార్లమెంటులో ఈ చట్టాన్ని వ్యతిరేకించే పరిస్ధితి లేదు. దీంతో మిగతా రాష్ట్రాల స్పందన ఆధారంగా త్వరలో తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశముంది.