సినిమా థియేటర్లలో 50 శాతానికి మించి, స్విమ్మింగ్ ఫూల్స్ ఇక అందరికీ: కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మరికొన్ని అంశాల్లో నవంబర్లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్గదర్శకాలే ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు వర్తిస్తాయని వెల్లడించింది.
సినిమా థియేటర్స్ ఇక 50 శాతానికి మించి..
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో కేంద్రం పలు నిబంధనలను సడలించింది. ఈ మేరకు మినహాయింపుల మార్గదర్శకాల గురించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం విడుదల చేశారు. గతంలో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చిన కేంద్రం.. తాజాగా అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో నడిపించుకోవచ్చని స్పష్టం చేసింది.
స్విమ్మింగ్ ఫూల్స్కు అందరూ వెళ్లవచ్చు..
ఇక కేవలం క్రీడాకారులే కాకుండా అందరూ స్విమ్మింగ్ ఫూల్స్కు వెళ్లేందుకు అనుమతిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త మార్గదర్శకాలను ఆయా శాఖలు విడుదల చేస్తాయని స్పష్టంచేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకూ అనుమతిచ్చింది. కేవలం బిజినెస్ తరహాలోనే కాకుండా అన్ని రకాల ఎగ్జిబిషన్ హాళ్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అంతర్జాతీయ విమాన సర్వీసులపై పౌర విమానయాన శాఖ కేంద్ర హోంశాఖతో పరిస్థితులపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.
సభలు, సమావేశాలపై సడలింపులు
సామాజిక, ఆధ్మాత్మిక, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక సంబంధిత సభలు, సమావేశాలకు హాలు సామర్థ్యంలో 50 శాతం లేదా 200 మందికి మించరాదు అన్న నిబంధనను కూడా తాజాగా సడలించింది. అయితే, దీనిపై ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతి అవకాశం ఉంటుందని తెలిపింది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లాలంటే ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదన్నారు.
సడలింపులు ఇచ్చినా.. జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందే..
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కేంద్రం తాజా సడలింపులు కల్పించినట్లు తెలుస్తోంది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. 65 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణీల, పదేళ్ల లోపు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Recommended Video