ఏదైనా ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే..: కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మారోసారి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. మే 31 వరకు పొడిగించిన ఈ లాక్డౌన్లో పలు సడలింపులను కూడా ఇచ్చింది. ప్రజా రవాణా విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారాన్ని ఇచ్చింది.
ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే...
దేశ వ్యాప్తంగా దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరవచ్చని కేంద్రం పేర్కొంది. అయితే, పని ప్రదేశంలో కరోనా నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఒక కార్యాలయంలో ఒకరికి లేదా ఇద్దరికి కరోనా సోకితే మొత్తం కార్యాలయాన్ని మూసివేయాల్సిన అవసరం లేదు. కరోనా బాధితులను ఆస్పత్రులకు తరలించి, వారు తిరిగిన ప్రదేశాన్ని డిస్ఇన్ఫెక్షన్ చేసిన 48 గంటల తర్వాత తిరిగి కార్యాలయంలో కార్యకలాపాలను చేసుకోవచ్చని తెలిపింది.
కరోనా లక్షణాలుంటే..
కార్యాలయంలో ఎవరైన కరోనా లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే కేంద్ర లేదా రాష్ట్ర వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలి. 1075 హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేసి వివరాలు చెప్పాలి. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆరోగ్యశాఖ పేర్కొంది.
Recommended Video
వారికి వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలి..
ఉద్యోగుల, సందర్శకులు సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే కరోనాకు దూరంగా ఉండవచ్చని తెలిపింది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులను తరచూ శుభ్రపర్చుకోవడం, శానిటైజర్స్ ను ఉపయోగించడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ఉద్యోగులు కోరితే వారికి వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించాలని కేంద్రం స్పష్టం చేసింది.