అదే ప్రతిష్ఠంభన- కేంద్రంతో రైతుల తొమ్మిదో విడత చర్చలూ విఫలం-19న మరోసారి
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో రెండు నెలలుగా నిరనసలు చేపడుతున్న రైతు సంఘాలు ఈ విషయంలో తమ వాదనకే కట్టుబడ్డాయి. దీంతో కేంద్రంతో జరిగిన తొమ్మిదో విడత చర్చలు కూడా ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీపై రైతు సంఘాల్లో చీలిక రావడం మినహాయించి ఎలా్ంటి పురగోతి కనిపించ లేదు.
ఇవాళ ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన తొమ్మిదో విడత చర్చల్లోనూ కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలూ తమ వాదనకే కట్టుబడ్డాయి. కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్తో పాటు మరో ఇద్దరు మంత్రులు పీయూష్ గోయల్, సోం ప్రకాష్ దాదాపు 40 రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు. ఇప్పటికే తాము రైతులు కోరుతున్న డిమాండ్లలో చట్టాలు వెనక్కి తీసుకోవడం మినహా మిగిలిన వాటిని ఆమోదించామని, కాబట్టి ఆందోళనలు విరమించాలని కేంద్రమంత్రులు కోరారు.
కానీ వ్యవసాయ చట్టాల్లో తమకున్న అనుమానాల మేరకు మార్పులుచేసేందుకు కేంద్రం అంగీకరించపోవడంపై రైతు సంఘాలు పెదవి విరిచాయి. ముఖ్యంగా కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించని పరిస్ధితుల్లో తాము ఆందోళనలు ఎలా విరమిస్తామని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇందులో సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటుపైనా రైతు సంఘాల్లో చీలిక కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తున్న వారితో కమిటీ ఏర్పాటుతో ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు ముందే చెప్పినట్లయిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ నెల 19న మరోసారి సమావేశమై చర్చలు జరపాలని ఇరువర్గాలూ నిర్ణయించాయి.