మళ్లీ తెరపైకి జమిలి-కేంద్రం సంకేతాలు- 2023లో తప్పదా ?
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తరచుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీగా వ్యయ ప్రయాసలు తప్పడం లేదని భావిస్తున్న కేంద్రం.. ఈ దిశగా న్యాయ కమిషన్ చేసిన సిఫార్సులను పరిశీలిస్తున్నట్లు ఇవాళ వెల్లడించింది. దీంతో జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో మరోసారి ఆశలు చిగురించాయి. కేంద్రం చేసిన ప్రకటనపై వివిధ రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అయితే ఎప్పటికల్లా ఈ జమిలి ఎన్నికలు ఉండొచ్చన్న దానిపై మాత్రం కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు.
Recommended Video
జమిలి ఎన్నికలు
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ వ్యవహారం కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా ఎన్డీయే సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దీనిపై చర్చ మొదలైంది. ప్రధాని మోడీ మానసపుత్రికగా భావిస్తున్న వన్ ఇండియా వన్ నేషన్ ను ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా న్యాయకమిషన్ సిఫార్సులతో ఈ వ్యవహారం ఎప్పటికప్పుడు తెరపైకి వస్తోంది. ఇప్పుడు తాజాగా మరోసారి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వ్యవహారంపై స్పందించారు. దీంతో జమిలి ఎన్నికలపై మరోసారి చర్చ మొదలైంది. ఎప్పుడు జరుగుతాయో తెలియకపోయినా జమిలి ఎన్నికలైతే ఉంటాయన్న సంకేతాలను కేంద్రం పంపినట్లయింది.
కేంద్రం పరిశీలనలో జమిలి ఎన్నికలు
జమిలి ఎన్నికలపై తాజాగా స్పందించిన న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు కేంద్రం దీన్ని పరిశీలిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా తరచుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వాలపై భారం పెరుగుతోందని, అందుకే వివిధ రాజ్యాంగ సంస్ధల సిఫార్సుల మేరకు జమిలి ఎన్నికల్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. లోక్ సభలో ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రిజిజు చెప్పిన అంశాలపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఎన్నికలు తరచుగా జరగడం వల్ల సాధారణ ప్రజా జీవితానికి కూడా ఇబ్బందులు కలుగుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వాలపై భారం వల్లే
దేశవ్యాప్తంగా 2014-19 మధ్య జరిగిన ఎన్నికలకు రూ.5814 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు కేంద్రం పార్లమంటులో వెల్లడించింది. లోక్ సభతో పాటే ఈ ఎన్నికలన్నీ జరిగి ఉంటే ఇంత ఖర్చయ్యేది కాదని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పెరుగుతున్న ఖర్చును దృష్టిలో ఉంచుకుని జమిలి ఎన్నికలకు కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించడం ద్వారా ఏటేటే వాటి వల్ల పడే భారం తగ్గుతూ వస్తుందని పార్లమెంటరీ స్ధాయీ సంఘం కూడా తన సిపార్సుల్లో పేర్కొందని రిజిజు గుర్తు చేశారు. ఈ సిఫార్సును మరింత లోతుగా పరిశీలించి అభిప్రాయాలు చెప్పాలని న్యాయకమిషన్ కు పంపినట్లు రిజిజు వెల్లడించారు. దీంతో లా కమిషన్ కూడా వివిధ వర్గాలను సంప్రదించి 244, 255 నివేదికల్లో జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆధార్-ఓటరు కార్డుల లింక్
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం... ఇపప్టికే వివిధ రాష్ట్రాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్న నకిలీ ఓట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆధార్ కార్డును ఓటర్ కార్డుకు లింక్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదించే అవకాశం ఉంది. అదే జరిగితే నకిలీ ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోతుందని భావిస్తున్నారు. దీంతో ఒకే వ్యక్తి భిన్న ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఎన్నికల అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
2023లోనే జమిలి ఎన్నికలు ?
జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెరపైకి తెస్తున్నా అవి ఎప్పుడు జరుగుతాయన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. 2022 లేదా 2023లో జమిలి ఎన్నికలు ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే వచ్చే ఏడాది యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువు కూడా తీరిపోనుంది. దీంతో జమిలి ఎన్నికలను వచ్చే ఏడాది చివర్లో లేదా 2023లోనే నిర్వహిస్తే బావుంటుందని కేంద్రం ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలు దీనికి ఎంతవరకూ సిద్దంగా ఉన్నాయన్న దానిపై భిన్న వాదనలు ఉన్నాయి.
6.
విపక్షాల్లో వ్యతిరేకత
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు ఎన్డీయే సర్కారు పావులు కదుపుతున్నా దీనిపై విపక్షాలు మాత్రం సంసిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూపీఏ పెద్దలతో పాటు తాజాగా వారికి మద్దతుదారులుగా మారుతున్న మమత, పవార్ వంటి వారు కూడా జమిలి ఎన్నికలకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జమిలి ఎన్నికల వల్ల నష్టం జరుగుతుందన్న కారణంతో కేసీఆర్ వంటి వారు ముందస్తు ఎన్నికలకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇలాంంటి పరిస్దితులే ఉన్నాయి. ఎందుకంటే ఎంపీలతో లింక్ చేసుకుని వెళ్లడం ద్వారా ఎమ్మెల్యేల్ని గెల్చుకోవడం కష్టమన్న భావన ముఖ్యంగా ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నెలకొంది. జాతీయ పార్టీలు మాత్రం కొంత మేర జమిలికి అనుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ జమిలి ఎన్నికలతో ప్రజావ్యతిరేకతను తప్పించుకునేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రతిపాదనకు విపక్షాలు ఎంత మేరకు సహకరిస్తాయన్న దానిపై చర్చ సాగుతోంది. అయితే విపక్షాలు సహకరించినా సహకరించకపోయినా లా కమిషన్ సిఫార్సుల ప్రకారం జమిలి ఎన్నికలకు ముందడుగు వేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా తాము రాజ్యాంగ బద్ధంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రజల్లోకి సంకేతాలు పంపాలనేది మోడీ సర్కార్ భావనగా తెలుస్తోంది.