రేపు భారత్ బంద్ ఎఫెక్ట్- భద్రత కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన
వ్యవసాయ బిల్లులకు వ్యతరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగబోతోంది. రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్కు విపక్షాలు కూడా మద్దతు ప్రకటించడంతో రేపు దేశవ్యాప్తంగా ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచించింది.
భారత్ బంద్ సందర్భంగా జనం ఎక్కువగా గుమి కూడకుండా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ నిబంధలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. భౌతిక దూరంతో పాటు ఇతర నిబంధనలు అమలయ్యేలా చూడాలని కోరింది. వివిధ రాష్ట్రాల్లో శాంతియుత పరిస్ధితులు కొనసాగేలా చూడాలని కూడా కేంద్ర హోంశాఖ కోరింది. ప్రస్తుతం దేశంలో ఉన్న శాంతియుత పరిస్ధితులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం తెలిపింది.
మరోవైపు ఈ బంద్లో తాము పూర్తిస్ధాయిలో పాల్గొని వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తామని 11 విపక్ష పార్టీలు, వాటి నేతలు ప్రకటించారు. ఇందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీపీఎం నేత ఏచూరి, సీపీఐ నేత డి.రాజా ఉన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధించినా తాము మాత్రం రైతుల వెంటే ఉంటామని వీరు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్తో పాటు ఇతర విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్దితులపై కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ఆరా తీస్తోంది.