కౌంట్ డౌన్..అయోధ్య తీర్పు: యూపీకి నాలుగు వేల మంది సాయుధ బలగాలు: చీమ చిటుక్కుమన్నా..!
లక్నో: అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అయోధ్య భూ వివాదం కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వెల్లడించడానికి ఇక మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయబోతున్నందున.. ఈ లోపే తీర్పు వెలువడటం ఖాయమైంది. సుప్రీంకోర్టు పని దినాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. వారం రోజుల వ్యవధి కూడా లేదు. ఏ రోజైనా అయోధ్య భూ వివాదంపై తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో- కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాద స్థలంపై సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడటానికి ముందు.. ఆ తరువాత తలెత్తే పరిస్థితులను అదుపు చేయడానికి పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ కు నాలుగు వేల మంది ప్రత్యేక సాయుధ బలగాలను పంపించింది. మరిన్ని బలగాలు సైతం సిద్ధం చేసింది. మంగళవారం లేదా బుధవారంలో సాయుధ బలగాలు ఉత్తర్ ప్రదేశ్ కు చేరుకుంటాయి. ఉత్తర్ ప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ కు రిపోర్ట్ చేయనున్నాయి. అనంతరం వారిని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరింపజేస్తారు. ఈ నెల 18వ తేదీ వరకు వారు విధుల్లో ఉంటారు.
అయోధ్య భూ వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టిని సారించారు. శాంతి భద్రతలను అదుపు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అందిన లేఖలపై చర్చించారు. అనంతరం ప్రత్యేక సాయుధ బలగాలను పంపించాలని నిర్ణయించారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్), కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెట్ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ), సీమా సురక్ష బల్ (ఎస్ఎస్బీ)లను కేటాయించింది.
ఈ నెల 18వ తేదీ వరకు ఆయా బలగాలకు చెందిన సాయుధ జవాన్లు ఉత్తర్ ప్రదేశ్ లో తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులను నిర్వర్తిస్తారు. దీనికి అదనంగా రాష్ట్ర పోలీసుల సహకారాన్ని వారు తీసుకుంటారు. అయోధ్య తీర్పు వెలువడబోతున్న సమయంలో తలెత్తే అవాంఛనీయ పరస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సోషల్ మీడియాపై నిఘా వేసిన విషయం తెలిసిందే. అయోధ్య తీర్పుపై వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ ఎవ్వరు ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.