భారత సైన్యంలో పెనుమార్పులు- ఇక ఊరికే రిటైర్మెంట్లు కుదరవు.. కేంద్రం సంకేతాలు..
భారత సైన్యంలోని త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సిబ్బంది విషయంలో ఓ కీలక నిర్ణయం దిశగా కేంద్రం అడుగులేస్తోంది. త్రివిధ దళాలకు అధిపతిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ ఈ మేరకు సైన్యంలో ప్రక్షాళన చర్యలకు శ్రీకారం చుట్టారు. సైనిక బలగాన్ని బలోపేతం చేస్తూనే వారి సేవలను మరింత కాలం వినియోగించుకునేలా ఈ మార్పులు ఉపయోగపడతాయని రావత్ చెబుతున్నారు.
చైనా దుందుడుకు చర్య.. భారత సరిహద్దు గగనతలంపై విమానాలతో చక్కర్లు..
సైన్యంలో వారి రిటైర్మెంట్ వయసు పెంపు...
భారత సైన్యంలోని త్రివిధ దళాల తరఫున పనిచేస్తున్న వారిలో 15 లక్షల మంది యువతరమే ఉన్నారు. వీరంతా జవాన్లు, ఎయిర్ మెన్లు, నావికుల రూపంలో ముందుండి నడిపిస్తున్నారు. మిగతా వారంతా వీరి వెనుక ఉంటూ సూచనలు, సలహాలు ఇస్తూ సైనిక కార్యకలాపాలు సాఫీగా సాగేలా పనిచేస్తున్నా్రు. అయితే సైన్యంలో యువకులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ వారి సేవలు ఎక్కువకాలం వినియోగించుకోకుండా రిటైర్మెంట్ నిబంధన వీరికి అడ్డుపడుతోంది. దీంతో త్వరలో వీరి రిటైర్మెంట్ వయసును పెంచాలని కేంద్రం నిర్ణయించింది.
రిటైర్మెంట్ వయసు పెంపు ఎందుకంటే...
ఇంతకీ అసలు రిటైర్మెంట్ వయసు పెంపు ఎందుకు తెరపైకి వచ్చిందంటే భారత సైన్యంలో యువకులు ఓ దశ వరకూ పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకునేలా నిబంధనలు ఉన్నాయి. దీంతో కనీసం 15 నుంచి 17 సంవత్సరాలు సేవలు అందించాక వీరంతా సైన్యాన్ని వీడుతున్నారు. రిటైర్మెంట్ తీసుకుని స్వస్ధలాలలకు వెళ్లిపోతున్నారు. దీని వల్ల ప్రతీ రెండు, మూడేళ్ల కోసారి భారీగా కొత్తవారిని తీసుకోవాల్సి వస్తోంది. వీరిని యుద్ధరంగంలోకి పంపాలంటే తగినంత తర్ఫీదు అవసరం. ఇదంతా పూర్తి కావాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పడం లేదు. అందుకే వీరి సేవలను మరికొంత కాలం వాడుకుంటే తప్పేంటనే వాదన మొదలైంది.
30 ఏళ్లకు పెంచే యోచన...
ప్రస్తుతం సైన్యంలో ఎంపికవుతున్న తర్ఫీదు పొందిన జవాన్లు, ఎయిర్ మెన్లు, నావికులు కనీసం 15 నుంచి 17 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాక రిటైర్మెంట్ తీసుకునే వీలు కల్పిస్తున్నారు. దీన్ని 30 ఏళ్లకు పెంచితే ఎలా ఉంటుందని కేంద్రం ఆలోచిస్తోంది. ట్రైనింగ్ తీసుకున్న వారు కేవలం 15 సంవత్సరాలకే రిటైర్మెంట్ తీసుకుంటే ఎలా ? కనీసం 30 ఏళ్లయినా పనిచేయాలి కదా అంటూ తాజాగా సీడీఎస్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు కేంద్రం తీసుకోబోయే నిర్ణయానికి సంకేతాలుగా భావిస్తున్నారు.
Recommended Video
త్రివిధ దళాల్లో భారీ మార్పులకు శ్రీకారం...
త్రివిధ దళాలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా సీడీఎస్ బిపిన్ రావత్ ప్రస్తుతం భారీ కసరత్తే చేస్తున్నారు. ఆర్మీ. ఎయిర్ ఫోర్స్ నుంచి జాయింట్ కమాండ్లు, నేవీ నుంచి మారిటైమ్ కమాండ్ల ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం వీటిపై అధ్యయనం జరుగుతోందని, ఈ ఏడాది చివరి నాటికి ఇవి పనిచేయడం ప్రారంభిస్తాయని రావత్ చెబుతున్నారు. అదే జరిగితే భారత్ సైనిక పరంగా బలీయశక్తిగా మారేందుకు అవకాశాలు వేగంగా లభిస్తాయని ఆయన అంటున్నారు.