లక్కీ ఫెలోస్: ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘ప్రధాని స్కాలర్ షిప్’.. నెలకు రూ.75 వేలు!
దేశంలోని ఐఐటీలు, యూనివర్సిటీలు లాంటి ఉన్నత విద్యాసంస్థల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన తొలి వెయ్యి మందికి ‘ప్రధాని స్కాలర్షిప్’ పేరిట నెలకు రూ.75 వేలు అందజేయనున్నట్లు కేంద్రమానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్
న్యూఢిల్లీ: మీరు క్లెవర్ స్టూడెంటా? అయితే ఈ లక్కీ చాన్స్ మీదే! ఉన్నత విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించే అత్యంత ప్రతిభావంతులైన వెయ్యి మంది విద్యార్థులకు నెలకు రూ.75 వేలు స్కాలర్షిప్ కింద అందజేయనున్నట్లు కేంద్రమానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ ప్రకటించారు.
త్వరలోనే 'ప్రధాని స్కాలర్షిప్' పేరిట ఈ పథకాన్ని ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, దీనికి సంబంధించిన ఫైల్పై తాను సంతకం కూడా చేసానని జవదేకర్ స్పష్టం చేశారు. ఐఐటీ ఢిల్లీలో సుమంత్ సిన్హా రెన్యూ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్(సీఈవో) ఆవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఐఐటీ, యూనివర్సిటీల్లో ప్రతిభ కనబర్చిన పరిశోధన విద్యార్థులకు ఈ పథకం చేయూతగా ఉంటుందన్నారు.
దేశంలోని ఐఐటీలు, యూనివర్సిటీలు లాంటి ఉన్నత విద్యాసంస్థల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన తొలి వెయ్యి మందికి ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేయనున్నట్లు జవదేవకర్ పేర్కొన్నారు. ఇదేమంత చిన్న విషయం కాదని, ఇలాంటి పథకం ప్రారంభించడం దేశ చరిత్రలోనే తొలిసారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతిభావంతులను వెలికితీయడంతోపాటు మేధోవలసను నిలుపుదల చేయడమే ఈ పథకం ముఖ్యోద్దేశమని కేంద్ర మంత్రి వివరించారు. దీని వల్ల భవిష్యత్తులో మేకిన్ ఇండియా కార్యక్రమానికి మరింత సహకారం లభిస్తుందని అన్నారు.
ఐఐటీల్లో ప్రస్తుతం 8 శాతంగా ఉన్నమహిళల సంఖ్య 2022 నాటికి 20 శాతానికి పెరుగుతుందని జవదేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వజీత్ ప్రాజెక్టు, ఉచ్చాతర్ అవిష్కార్ పథకాలతో ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన విభాగాలను పటిష్ఠం చేస్తున్నామని ఈ సందర్భంగా జవదేకర్ తెలిపారు.
దీని కోసం ప్రస్తుతం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, భవిష్యత్తుల్లో దీన్ని రూ.20 వేల కోట్లకు తీసుకెళతామని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి పరిశోధన ప్రమాణాలు నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జవదేకర్ వెల్లడించారు.