‘లాక్డౌన్’ అంటే లాక్డౌనే: రాష్ట్రాలకు తేల్చి చెప్పిన కేంద్రం, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రాలన్నీ లాక్డౌన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అంతేగాక, లాక్ డౌన్ ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది.
జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని కొనసాగించాలి..
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడం చేయడంలో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆదివారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, లాక్ డౌన్ని ప్రజలు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశం యావత్తు ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తిని మార్చి నెలాఖరు వరకు కొనసాగించాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.
నిర్లక్ష్యం వీడండి..
అంతేగాక, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్ డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని మోడీ కోరారు. అందరూ ఆరోగ్య సూచనలు పాటించాలని ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా సూచించారు. లాక్ డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, దీన్ని ఎందుకు అమలు చేశామో గుర్తించాలని కోరారు.
రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించాలంటూ హెచ్చరిక
లాక్డౌన్ ను తీవ్రంగా పరిగణించి దేశ ప్రజలందరూ పాటించాలన్నారు. మనల్ని మనం రక్షించుకోవడానికే లాక్ డౌన్ విధించికున్నామని, దీని గురించి అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తుల్లో ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. ఇటలీ, ఇరాన్, స్పెయిన్ అనుభవాలు మరిచిపోవద్దని అన్నారు. దేశంలో ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతను గుర్తించి ప్రవర్తించాలన్నారు.
పెరుగుతున్న పాజిటివ్ కరోనా కేసులు
కాగా, తెలంగాణలో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఆంధ్రప్రదేశ్ లో 6 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 415కు చేరింది. మృతుల సంఖ్య 8కి చేరింది. ఇందులో ఒక విదేశీయుడు ఉన్నాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 3,41,243 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 14,746 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇటలీ, చైనా, ఇరాన్, స్పెయిన్ దేశాల్లో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.