మరో కొద్ది గంటల్లో ఫణి తుఫాను , ముందస్తు సహయక చర్యల కోసం 1000 కోట్లు
Recommended Video
ఫోని తుపాను ప్రమాదం పొంచి ఉండడంతో బంగాళఖాతం తీర ప్రాంతాలను కల్గి ఉన్న నాలుగు రాష్ట్రాలకు ముందస్తు సహాయ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం 1086 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 200 కోట్ల రుపాయలను కేటాయించింది.
మరో పన్నేండు గంటల్లో తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుఫాను తీవ్ర రూపం దాల్చుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. తుపాను కారణంగా బంగాళాఖాతం తీర ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్ , ఒడిశా, తోపాటు తమిళనాడు , పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తుపాను బీభత్సంపై ముందే వాతావరణ శాఖ సైతం హెచ్చరించింది.
ఏపీకి రూ. 200 కోట్లు కేటాయింపు
ఈనేపథ్యంలోనే మొత్తం నాలుగు రాష్ట్రాలకు గాను ఏన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం ఆయా రాష్ట్రాలకు విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు రూ. 200.25 కోట్లు తమిళనాడు రాష్ట్రానికి రూ. 309.37 కోట్లు, ఒడిశాకు 340.87 కోట్లు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 233.50 కోట్లను కేటాయించారు.
చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన తుపాను
ప్రస్తుతం మచీలీ పట్నానికి ఆగ్నేయంగా 760 కి.మీలు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. దీంతో అది గంటకు 16 కి.మీ వేగంతో తీరంవైపు కదులుతున్నట్టు అధికారులు తెలిపారు.కాగా మరో 12 గంటల్లో తుపానుగా మారి 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వీటి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తోపాటు సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతవరణ శాఖ అధికారులు తెలియజేశారు.