ఢిల్లీ కాలుష్యం: ప్రధానికి ప్రిన్సిపాల్ సెక్రటరీ నేతృత్వంలో హైలెవల్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యంపై ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రికి ప్రిన్సిపాల్ సెక్రటరీ, భారత కేబినెట్ సెక్రటరీలు ఈ కీలక సమావేశంలో పాల్గొని కాలుష్యంపై చర్చించనున్నారు.
దేశ రాజధానితోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాలుష్య సమస్యపై ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది.
ఢిల్లీ వాయు కాలుష్యం ఎఫెక్ట్: దేశ రాజధానిని వీడాలనుకుంటున్న 40 శాతం ప్రజలు
ఈ కీలక సమావేశానికి ప్రధానమంత్రికి ప్రిన్సిపాల్ సెక్రటరీ అధ్యక్షత వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు, ఇతర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాలుష్య సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించనున్నారు.
ఆదివారం దేశ రాజధానిలో వాయు కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. అది 999 మార్క్కి చేరుకుంది. జహంగిర్పూరి, రోహిణి, సోనియా విహార్, షహ్దరా, ఓఖ్లా, మేజర్ ధ్యాన్, చాంద్ స్టేడియం, ఆనంద్ విహార్, పంజాబీ బాగ్, పూస, మందిర్ మార్గ్, ముండ్కా, శ్రీనివాస్పురి, జేఎన్యూ ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉంది. ఇతర ప్రాంతాల్లో కూడా కాలుష్యం 900 మార్కును దాటడం గమనార్హం.
ఇది ఇలావుండగా, ఢిల్లీ వాతావరణం మొత్తం విషపూరితంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో నివాసం ఉంటున్న ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి ఇతర నగరాలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. దాదాపు 40శాతం మంది ప్రజలు తమ నివాసాలను విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు తాజాగా ఓ సర్వే తేల్చింది. కాలుష్యం ఎక్కువగా ఉన్న కాలంలో ఇతర ప్రాంతాలకు వెళ్లాలని 16శాతం ప్రజలు అనుకుంటున్నట్లు తేలింది.
17వేల మందికిపైగా ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఈ సర్వే నిర్వహించగా.. కాలుష్యం వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమకు ఈ ప్రాంతంను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేదని స్పష్టంచేశారు. దాదాపు 40శాతానికిపైగా ప్రజలు కాలుష్యం కారణంగా ఢిల్లీ, ఎన్సీఆర్ను వదిలి ఇతర నగరాలకు వెళ్లాలని నిర్ణయించుకోగా.. 31శాతం మంది ప్రజలు మాత్రం ఈ ప్రాంతంలోనే ఉంటూ ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, మాస్కులు వాడుకుంటామని చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు విషయాలు లోకల్ సర్కిల్స్ అనే సర్వేలో తేలింది.