రేషన్ కార్డు దారులకు కేంద్రం ఊరట- వన్ నేషన్-వన్ రేషన్ తో దేశంలో ఎక్కడైనా తీసుకునే వీలు..
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రేషన్ కార్డు దారులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి దేశంలో ఎక్కడైనా తమ రేషన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రేషన్ లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పేదలకు ఐదు కేజీల బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన ఆత్మ నిర్భర్ అభియాన్ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
ఇప్పటివరకూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పేదలు పనుల కోసం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే వారికి రేషన్ అందడం లేదు. దీంతో వలస కార్మికులతో పాటు పేదల ఇబ్బందులు తొలగించేందుకు గానూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయ.
అయితే చాలా రాష్ట్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కానందున ఈ పథకం అమలు కావడం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో డిజిటలైజేషన్ ప్రక్రియకు ఊపు రావడంతో కేంద్రం కూడా వన్ నేషన్-వన్ రేషన్ పథకం అమలు కోసం సిద్ధం కావాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తోంది. ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డు ఉన్నా, లేకపోయినా సరే రేషన్ పొందే వీలు కలగనుంది. తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 63 కోట్ల మందికి ఈ పథకం ద్వారా వెసులుబాటు లభిస్తుందని అంచనా వేశారు.