త్వరలో అమెజాన్, ఫేస్ బుక్, గూగుల్ కూ చెక్- కేంద్రం కొత్త ఈ కామర్స్ ప్లాన్ రెడీ...
కరోనా సంక్షోభం తర్వాత కుదేలవుతున్న దేశ ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలో ఒకప్పుడు సరళీకృత ఆర్ధిక విధానాల అండతో ప్రవేశించి భారీ మార్కెట్ ఏర్పాటు చేసుకున్న విదేశీ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫేస్ బుక్, గూగుల్, అమెజాన్ వంటి సంస్ధలను నియంత్రించడం ద్వారా దేశీయ సంస్ధలను ప్రోత్సహించేలా కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకు రానుంది. అదే జరిగితే ఇప్పటి వరకూ భారత్ ను ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా భావిస్తున్న ఈ సంస్ధలకు చుక్కలు కనిపించడం ఖాయం.
Recommended Video
అమెజాన్, ఫేస్ బుక్, గూగుల్ కు చెక్...
కరోనా సంక్షోభం తర్వాత దేశీయ పరిశ్రమలకు ప్రోత్సహం ఇచ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా చైనా దాడులను అడ్డుపెట్టుకుని అక్కడి సంస్ధలకు చెందిన 59 యాప్ లపై నిషేధం విధించింది. ఆ తర్వాత వీటికి పోటీ యాప్ లు రూపొందించాలని దేశంలోని సంస్ధలకు సవాల్ కూడా విసిరింది. ఇప్పుడు విదేశీ ఈ కామర్స్ సంస్ధలపైనా ఇదే మంత్రం ప్రయోగించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. స్వయం సమృద్ధి పేరుతో దేశ ఆర్ధిక వ్యవస్ధలో చేపడుతున్న ఈ మార్పుల్లో భాగంగా ఇకపై విదేశీ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్, ఫేస్ బుక్, ఆల్ఫాబెట్ వంటి దిగ్గజాలపై ఆంక్షల కొరడా ఝళిపించబోతోంది.
కొత్త ఈ కామర్స్ పాలసీతో చెక్...
దేశీయ సంస్దలకు ప్రోత్సహం కల్పించడంతో పాటు విదేశీ ఈ-కామర్స్ సంస్ధలపై నియంత్రణలు విదించేందుకు వీలుగా కేంద్రం కొత్త ఈ-కామర్స్ విధానానికి రూపకల్పన చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే విదేశీ ఈ-కామర్స్ సంస్ధలు తప్పనిసరిగా తమ సమాచార నిర్వహణతో పాటు ఇతర అంశాలనూ ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది. వీటిపై నిరంతర పర్యవేక్షణ కోసం ఓ ప్రత్యేక యంత్రాంగం కూడా ఏర్పాటు కానుంది. విదేశీ ఈ కామర్స్ సంస్ధల సమాచారాన్ని ఎప్పుడైనా తెలుసుకునేందుకు, ఆన్ లైన్ సంస్ధల సోర్స్ కోడ్ లు, ఆల్గారిథమ్స్ సైతం ప్రభుత్వం అవసరమైనప్పుడు అడిగి తీసుకునేలా ఈ పాలసీలో పలు క్లాజ్ లు పెడుతున్నారు.
మార్పులతో వీరికి ప్రయోజనం..
విదేశీ ఈ-కామర్స్ సంస్ధలను పొమ్మనకుండా పొగబెట్టేలా కేంద్రం తీసుకొస్తున్న సరికొత్త విధానంతో దేశీయ సంస్ధలకు భారీగా ప్రయోజనం కలిగేలా కేంద్రం ప్రస్తుత విధానంలో మార్పులు చేస్తోంది. తద్వారా విదేశీ సంస్ధలతో పోటీ పడే స్ధాయికి దేశీయ కంపెనీలను ప్రోత్సహిస్తారు. తాజా పాలసీ ప్రకారం కేంద్రం దేశీయంగా ఆన్ లైన్ రిటైలింగ్, స్ట్రీమింగ్, మెసేజింగ్, డిజిటల్ పేమెంట్స్ రంగాల్లో సంస్ధలను ప్రోత్సహించబోతోంది. డేటా లోకలైజేషన్ తో పాటు ఇతర ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేయడం ద్వారా విదేశీ సంస్ధలను నిరుత్సాహపరిచేలా మార్పులు ఉండబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజా విధానం రెండేళ్ల పాటు అమల్లో ఉండేలా వాణిజ్య శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.