చైనా వస్తువులు బ్యాన్..? 4జీ అప్ గ్రేడ్ పరికరాలు వద్దు, బీఎస్ఎన్ఎల్కు టెలీకాం శాఖ ఆదేశాలు
డ్రాగన్ చైనా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందున.. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా అడుగులు వేస్తోంది. చైనా దమననీతిని అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు చైనా ఉత్పత్తులను కూడా అప్రకటితంగా నిషేధిస్తోంది. ఇందులో భాగంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 4 జీ అప్గ్రేడెషన్ కోసం చైనా ఉత్పత్తులను వాడొద్దని చెప్పినట్టు తెలుస్తోంది.
ఒకవేళ చైనా వస్తువులను వాడుతున్నట్లయితే వెంటనే నిలిపివేయాలని.. ఇందుకోసం తిరిగి టెండర్ వేయాలని కేంద్ర టెలికాం శాఖ బీఎస్ఎన్ఎల్కు స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని ఎంటీఎన్ఎల్కు స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రైవేట్ మొబైల్ ఆపరేటర్స్ కూడా చైనా రూపొందించిన వస్తువుల వాడకాన్ని తగ్గించాలని చెప్పే అవకాశం ఉంది.
Recommended Video
చైనా కంపెనీలు తయారుచేసే పరికరాలు భద్రత ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుందని.. ఇదీ కూడా ఒక కారణం అని చెబుతున్నారు. దీనికితోడు సోమవారం రాత్రి తూర్పు లడాఖ్లో జరిగిన ఘర్సణతో పరిస్తితి ఒక్కసారిగా మారిపోయింది. 20 మంది సైనికులు చనిపోవడంతో.. కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 1967 తర్వాత భారీగా జవాన్లు చనిపోవడంతో.. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని భారత వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి దృష్ట్యా చైనా వస్తువులను బ్యాన్ చేయాలనే నిరసనలు మిన్నంటాయి. దీంతో చైనాకు చెందిన ఒప్పొ తన ప్లాగ్ షిప్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ విడుదలకు సంబంధించి దేశంలో లైవ్ స్ట్రీమ్ రద్దుచేసింది. ఇదేవిధంగా మిగతా కంపెనీలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.