మా ఐక్యతను దెబ్బతీసేందుకు కేంద్రం యత్నం: ముస్లిం పర్సనల్ లా బోర్డు
హైదరాబాద్:తమ ఐక్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆరోపించింది.మూడు రోజుల పాటు హైద్రాబాద్లో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశాలు జరిగాయి .
ఫిబ్రవరి 11వ, తేదిన హైద్రాబాద్లో ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశాలు ముగింపు సమావేశం జరిగింది.బోర్డులోని కొందరు సభ్యులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బోర్డును చీల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బోర్డు ఆరోపించింది.మూడు రోజుల పాటు జరిగిన సమావేశం హైద్రాబాద్ డిక్లరేషన్ను ప్రకటించింది.
బోర్డు కార్యదర్శులు మౌలానా ఖలీద్ సైఫుల్లా, జఫర్ జిలానీ, ఉమరైన్ మహేఫుజ్, డాక్టర్ అస్మ జహేరా, యాసీన్ ఉస్మానీ, రహీముద్దీన్, తదితరులు మాట్లాడారు. భారతదేశంలో మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. ఫలితంగా ముస్లింలను అభద్రతాభావం వెన్నాడుతోందన్నారు. ముస్లింలను అనైక్యం చేయడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
బాబ్రీ మసీదు విషయంలో రాజీ పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. షరియత్ దృష్టిలో మసీదు ఒకసారి నిర్మిస్తే ప్రళయం వచ్చినా అది మసీదుగానే ఉంటుందన్నారు. దాన్ని తరలించే ప్రసక్తే లేదన్నారు
అయితే మూడు రోజుల సమావేశాల్లో బోర్డు సభ్యుడిగా ఉన్న సల్మాన్ హుస్సేనీ నద్వీ బోర్డు నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.బాబ్రీ మసీదు వివాదాన్ని రాజకీయాలకు అతీతంగా పరిష్కరించుకోవాలని నద్వీ ప్రతిపాదిస్తున్నాడు.
అయితే ఈ ప్రతిపాదనను బోర్డు తిరస్కరించింది.అయితే తాను బోర్డు నుండి వైదొలుగుతున్నట్టు నద్వీ ప్రకటించారు. మరో వైపు కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించడం సంచలనం కల్గించింది.