ఆర్మీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులపై వెనక్కి తగ్గిన కేంద్రం- కారణమిదేనా ? వారికి భారీ ఊరట..
కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పారా మిలిటరీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తుల విక్రయం ద్వారా దేశీయంగా స్ధానిక పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ కల నెరవేరలేదు. లాక్ డౌన్ కారణంగా తలెత్తిన ఇబ్బందులతో పాటు ఇతరత్రా సమస్యలతో కేంద్రం మే 15న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది.
ఉధృతి తగ్గని కరోనా: ఏపీలో అదే తీరు: ఈ సారీ భారీగా పాజిటివ్ కేసులు: ఇప్పటికింతే
కేంద్రం స్వదేశీ ఆదేశాలు...
కరోనా సంక్షోభం దేశీయ పరిశ్రమలను కుదేలు చేస్తున్న వేళ వాటికి ప్రోత్సాహం ఇచ్చేందుకు వారం రోజుల క్రితం ఓ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1700 సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎప్, ఎస్ఎస్బీ క్యాంటీన్లలో జూన్ 1 నుంచి స్వదేశీ ఉత్పత్రులే విక్రయించాలని కేంద్రం మే 15వ తేదీన ఆదేశాలు ఇచ్చింది. దీంతో మల్టీ నేషనల్ కంపెనీలతో పాటు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు విక్రయిస్తున్న సంస్ధలకు భారీ షాక్ తగిలింది.
అమలు చేయలేని పరిస్ధితి..
దేశవ్యాప్తంగా ఉన్న పారా మిలిటరీ క్యాంటీన్లలో ప్రస్తుతం 400 మంది అమ్మకం దార్ల నుంచి వివిధ రకాల వస్తువులను, ఇతర ఉత్పత్తులను కొంటోంది. వీటిని తక్షణం నిలిపేసి జూన్ 1 నుంచి స్వదేశీ ఉత్పత్తులే విక్రయించేలా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రస్తుత పరిస్దితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు లాక్ డౌన్ కారణంగా మూతపడి ఉన్నాయి. వీటిని తెరిచి ఉత్పత్తి ప్రారంభిస్తే కానీ మిలిటరీ క్యాంటీన్లకు సప్లై చేసే పరిస్ధితి లేదు. ఆ లోపు క్యాంటీన్లలో స్టాక్ అయిపోతే ఇబ్బందులు తప్పవు. అప్పుడు దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చే ప్రమాదముంది. కేంద్రం స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని ఆదేశాలు ఇచ్చినా వాటి సరఫరా లేకపోవడంతో క్యాంటీన్ల నిర్వహణలో గందరగోళం తలెత్తింది.
వెనక్కి తగ్గిన కేంద్రం... వారికి ఊరట..
మిలిటరీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తుల విక్రయానికి పరిస్ధితులు అనువుగా లేవని భావించిన కేంద్రం గతంలో ఇచ్చిన ఆదేశాలను ఇవాళ ఉపసంహరించుకుంది. దీంతో ఇప్పటికే ఉన్న 400 మంది అమ్మకందారుల నుంచి కొనుగోళ్లను కొనసాగించాలని ఆదేశాలు వచ్చాయి. పరిస్ధితులు మెరుగుపడ్డాక దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. 2006లో ప్రారంభమైన మిలిటరీ క్యాంటీన్ల నెట్ వర్క్ ద్వారా రూ.2800 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. వీటిలో 119 మాస్టర్ క్యాంటీన్లతో పాటు 1625 సబ్సిడరీ క్యాంటీన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది పారా మిలటరీ బాలగాలతో పాటు వారి కుటుంబాల్లోని వారితో కలుపుకుని దాదాపు 50 లక్షల మందికి అవసరమైన ఉత్పత్తులు ఈ క్యాంటీన్లలో లభిస్తున్నాయి.