ఆ రాష్ట్రంలో కొనసాగుతోన్న హింస...శాంతి భద్రతలపై ప్రశ్నించిన కేంద్రం
ఢిల్లీ: వెస్ట్ బెంగాల్లో హింసాత్మక వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఈ హింస... ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగుతుండటం అక్కడి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో నలుగురు కార్యకర్తలు మృతి చెందారు. ఇందులో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉండగా ఒకరు టీఎంసీ కార్యకర్త మృతి చెందాడు. దీంతో బెంగాల్లో మమత సర్కార్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అక్కడి శాంతి భద్రతలు క్షీణిస్తుండటంతో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని అక్కడి తాజా పరిస్థితిపై ఆరా తీసింది. అయితే ఇది రాజకీయ వివాదంగా మమతా ప్రభుత్వం కేంద్రానికి సమాధానం చెప్పింది.
ఇక ఎన్నికల అనంతరం స్వల్ప ఘర్షణలు చెలరేగాయని అయితే తాజా పరిస్థితి అంతా అదుపులోనే ఉన్నట్లు కేంద్రానికి మమతా సర్కారు లేఖ రాసింది. ఇదిలా ఉంటే రెండ్రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో చాలా మంది బీజేపీ కార్యకర్తలు కనిపించకుండా పోయారని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో కొందరిని టీఎంసీ కార్యకర్తలు హత్య చేసి ఉంటారనే అనుమానంను బీజేపీ కార్యకర్తలు వ్యక్తం చేశారు. మరోవైపు హింసకు వ్యతిరేకంగా బీజేపీ బసిర్హాత్లో 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చింది. తమ పార్టీ కార్యకర్తలను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. ఇప్పటికే హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నామని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మలే కుమార్ డి తెలిపారు.
ఎన్నికల తర్వాత కొందరు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడ్డారని అలాంటి వారిని గుర్తించి పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రానికి తెలిపారు చీఫ్ సెక్రటరీ. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా సరే విడిచిపెట్టేది లేదని కేంద్రానికి రాసిన లేఖలో సీఎస్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత కూడా బెంగాల్లో హింసా వాతావరణం నెలకొనడం దురదృష్టకరమన్నారు. లోక్సభ ఎన్నికల్లో టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఇలా బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం దారుణమని పేర్కొంది.శాంతి భద్రతలను పరిరక్షించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రం వ్యాఖ్యానించింది.