ఆందోళనకరం: 11 కోట్ల మంది రెండో డోసు వేసుకోకుండా తిరుగుతున్నారు!, రేపు కేంద్రమంత్రి భేటీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇటీవల 100 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమయంలో మొదటి డోసు, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య అంరతం భారీగా ఉంది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మొదటి డోసు తీసుకుని రెండో డోసు తీసుకునేందుకు జాప్యం చేస్తున్నవారి సంఖ్య భారీగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
గడువు ముగిసినా రెండో డోసు వేసుకోని 11 కోట్ల మంది..
సుమారు 11 కోట్ల మంది రెండో డోసు గడువు ముగిసిపోయినప్పటికీ.. టీకా వేసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో సమావేశం కానున్నారు. పెండింగ్లో ఉన్న రెండో డోసు, ఇప్పటి వరకు మొదటి డోసు తీసుకోని వారికి టీకాలు అందించడంపై చర్చించనున్నారు.
టీకా డోసులు అందుబాటులో ఉన్నా ప్రజల్లో నిర్లక్ష్యం..
టీకా డోసులు అందుబాటులో ఉన్నప్పటికీ రెండో డోసు తీసుకునే విషయంలో ప్రజలు ముందుకు రాకపోవడం శోచనీయం. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 75 శాతం మంది మొదటి డోసు తీసుకోగా.. 31 శాతం మంది మాత్రమే రెండో డోసు కూడా తీసుకున్నారు. కరోనా టీకా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరింతగా ప్రోత్సహించాలని కేంద్రం సూచిస్తోంది. దేశంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే.
కొత్త రకం కరోనా వేరియంట్లు..
మరోవైపు, యూకేలో గుర్తించిన డెల్టా సబ్ వేరియంట్పై నిపుణుల బృందం దృష్టి సారించిందని మంగళవారం మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఏవై.4.2 వేరియంట్పై పరిశోధనలు చేస్తోందన్నారు. ఐసీఎంఆర్, ఎన్సీడీసీ బృందాలు వివిధ రకాలైన వేరియంట్ల స్వభావాన్ని పరిశీలించనున్నారని కేంద్రమంత్రి తెలిపారు. తాజాగా, ముంబైలోనూ డెల్టా వేరియంట్ రకం కరోనా కేసులు వెలుగు చూడటం గమనార్హం.
Recommended Video
కోవాగ్జిన్కు కొద్ది గంటల్లో డబ్ల్యూహెచ్ఓ అనుమతి..
ఇక హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగంపై మంగళవారం జరిగే సమావేశం ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓలో టెక్నికల్ కమిటీ కోవాగ్జిన్కు ఆమోదం తెలిపింది. మంగళవారం మరో కమిటీ దీనిపై చర్చిస్తోంది. దీని ఆధారంగా కోవాగ్జిన్ కు ఆమోదం లభిస్తుందని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. త్వరలో చిన్నారులకు టీకాలు అందుబాటులోకి రానున్నాయని, ఈ క్రమంలో జైకో-డీ ధర గురించి చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, భారతదేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రస్తుతం 1.60లక్షలకు కరోనా యాక్టివ్ కేసులు దిగివచ్చాయి.