కార్పొరేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
ముంబై: ప్రసిద్ధి చెందిన కార్పొరేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ బండారం బయటపడింది. భారీ మొత్తంలో నగదు తీసుకుని అమాయకుల కిడ్నీలను శ్రీమంతులకు విక్రయిస్తున్నారని ముంబై పోలీసులు తెలిపారు.
ఈశాన్య ముంబైలోని ఎల్ హెచ్ హీరానందాని కార్పొరేట్ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమ కిడ్నీ ఆపరేషన్లను పోలీసులు అడ్డుకున్నారు. కార్పొరేట్ ఆసుపత్రి సీఈవో, నలుగురు సీనియర్ డాక్టర్లతో పాటు మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ముంబై నగర సీనియర్ పోలీసు అధికారి అశోక్ దుబే కిడ్నీ రాకెట్ వివరాలు వెల్లడించారు. ఆసుపత్రి సీఈవో సుర్జీత్ ఛటర్జీ, సీనియర్ డాక్టర్లు అనురాగ్ నాయక్, ముఖేష్ సేథీ, ముఖేష్ షా, ప్రకాశ్ శెట్టి అరెస్టు అయ్యారు.
వీరితో పాటు రోగి కుమారుడు కిషన్, కిడ్నీ రాకెట్ ఏజెంట్ కాంబ్లీ, సబ్ ఏజెంట్లు భిజేందర్, భరత్ శర్మ, ఇక్బాల్ సిద్ధిఖీ, కిడ్నీ దానం చెయ్యడానికి ముందుకు వచ్చిన రేఖ తో సహ 13 మందిని అరెస్టు చేశారు.
సూరత్ కు చెందిన వ్యాపారవేత్త కిషోర్ జైస్వాల్ కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆయన ముంబై చేరుకుని హీరానందాని ఆసుపత్రిలో చేరాడు. కిడ్నీలు మార్పిడి చెయ్యాలని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న కిడ్నీ ఏజెంట్ నిలేష్ కాంబ్లీ జైస్వాల్ కుటుంబ సభ్యులను సంప్రదించాడు.
తాను కిడ్నీ ఏర్పాటు చేస్తానని చెప్పి భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశాడు. అతను అడిగిన డబ్బు ఇవ్వడానికి జైస్వాల్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. శోభా ఠాకూర్ అలియాస్ రేఖ అనే మహిళ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
రేఖకు రూ. 21 లక్షలు ఇచ్చారు. జైస్వాల్ భార్య అంటూ ఆసుపత్రిలో రేఖను డాక్టర్లకు పరిచయం చేశారు. మంగళవారం రాత్రి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చెయ్యడానికి ఆపరేషన్ కు అన్నీ సిద్దం చేశారు.
సామాజిక కార్యకర్త మహేష్ తన్నాకు విషయం తెలియడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆసుపత్రి చేరుకుని విచారణ చేశారు. జైస్వాల్ భార్య రేఖానా ? కాదా ? బంధువా ? అని కనీసం డాక్టర్లు ఆరా తీయ్యలేదని వెలుగు చూసింది.
ఎలాంటి వివరాలు తెలుసుకోకుండా కిడ్నీ ఆపరేషన్ చెయ్యడానికి డాక్టర్లు సిద్దం అయ్యారు. ఈ విధంగా వీరు ఇప్పటి వరకు 100 ఆపరేషన్లు చేశారని విచారణలో వెలుగు చూసిందని పోలీసులు చెప్పారు. బుధవారం నిందితులను కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు.