ఒక ఆర్థికవేత్త కంటే ఛాయ్వాలానే దేశాన్ని విజయపథంలో తీసుకెళ్లారు: అమిత్ షా
ఢిల్లీ: ఒక ఆర్థివేత్త కంటే ఒక ఛాయ్ వాలా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో సక్సెస్ సాధించారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటే తనకెంతో గౌరవమని చెబుతూనే ప్రధాని మోడీ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు. నరేంద్ర మోడీపై వచ్చిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారని చెప్పిన అమిత్ షా.. వారు ముందుగా కఠినత్వానికి నియంతత్వానికి తేడా తెలుసుకోవాలని సూచించారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఆర్థిక వ్యవస్థను నియంత్రణలో ఉంచడమే కాదు ద్రవ్యోల్బణంను కూడా తగ్గించిందని గుర్తు చేశారు. ప్రధానిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ తను పదవీచుతుడు అయ్యేనాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 9వ స్థానానికి పరిమితం చేయగా... ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాక ఆర్థిక వ్యవస్థను ఐదేళ్లలో ఆరో స్థానానికి తీసుకొచ్చారని కొనియాడారు. ఇక మరో ఆరు నెలల సమయంలో అది ఐదవ స్థానానికి చేరుకుంటుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేనివారు తమకు ఆర్థికశాస్త్రం గురించి వివరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మన్మోహన్ ఒక ఆర్థిక వేత్త అని చెప్పిన అమిత్ షా తనకున్న లోతైన జ్ఞానంను గౌరవిస్తామని అయితే ఒక ఛాయ్వాలా మాత్రం దేశాన్ని సరైన దిశలో నడుపుతున్నారని మోడీకి కితాబిచ్చారు.
బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం తీసుకున్న 30 చారిత్రాత్మక నిర్ణయాలు తాను గర్వంగా చెప్పగలనని చెప్పిన అమిత్ షా గత ప్రభుత్వాలు గత 30 ఏళ్లలో తీసుకున్న 4 లేదా 5 నిర్ణయాలు చెప్పగలవా అంటూ సవాల్ విసిరారు. ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో సర్జికల్ స్ట్రైక్స్, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. వెయ్యేళ్ల దేశ చరిత్రలో ఈ నిర్ణయాలను సువర్ణాక్షరాలతో లిఖించాలని చెప్పారు. ప్రధాని మోడీ తన కఠిన నిర్ణయాలతో ఆదర్శమైన పాలన అందించారని చెప్పిన అమిత్ షా ఎక్కడా ప్రజాస్వమ్యాన్ని అపహాస్యం చేయలేదన్నారు. గత 35 ఏళ్లుగా ప్రధాని మోడీతో తాను కలిసి పనిచేస్తున్నానని చెప్పిన అమిత్... మోడీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వింటారని అదే అతని విజయానికి దోహదపడిందని పొగడ్తల వర్షం కురిపించారు. దేశ అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే వారు నియంత కాదని ఆయన గుర్తు చేశారు. అందరూ చెబుతున్న విషయాలను పరిగణలోకి తీసుకుని ఆ విధంగా నడుచుకునే వారే విజయం సాధిస్తారని అది నరేంద్ర మోడీ అని చెప్పారు.