మా వల్లే ఓ చాయ్వాలా నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు: మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం వల్లే ఓ చాయ్వాలా దేశానికి ప్రధానమంత్రి అయ్యారని ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. దశాబ్దాల పాటు తమ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు.
43 సంవత్సరాల నాటి అత్యయికస్థితి రోజులను గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు, గత నాలుగేళ్లుగా దేశంలో కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని నరేంద్ర మోడీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగబట్టే ఈ రోజు ఓ చాయ్వాలా ప్రధానమంత్రిఅయ్యారని చెప్పారు. మేము ప్రజాస్వామ్యాన్ని అంతలా కాపాడామని చెప్పారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే పాలన ప్రారంభమైన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు.
రైతులకు కొత్త రుణాలు రావడం లేదని మండిపడ్డారు. పలు సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులను కూడా గుర్తు చేశారు. బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వ్యక్తిత్వాలపై దాడి చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఓ కుటుంబం వంటిదన్నారు. తామంతా అందులో సభ్యులం అన్నారు.