దమ్ముంటే పట్టుకోండి, ట్రాఫిక్ పోలీసులకు చాలెంజ్, అవమానం, వీడియో వైరల్!
బెంగళూరు: మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి, నా కారుకు ఎలాంటి దృవీకరణ పత్రాలు లేవు, నేను వచ్చే తేదీ కూడా చెబుతాను, ఇదే నా చాలెంజ్ అని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు చాలెంజ్ చేసి వీడియో పంపించిన కారు డ్రైవర్ చివరికి మైసూరులో అడ్డంగా చిక్కిపోయాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను అవమానంగా మాట్లాడి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన కారు డ్రైవర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
దమ్ముంటే పట్టుకోండి
కర్ణాటకలోని మైసూరు జిల్లా హుణసూరు తాలుకాకు చెందిన రఘు (27) కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ నేను బెంగళూరుకు వస్తున్నాను, నా కారుకు ఎలాంటి దృవీకరణ పత్రాలు లేవు, మీకు దమ్ముంటే నన్ను పట్టుకుని అరెస్టు చెయ్యాలని ఓ వీడియో తీసి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు చాలెంజ్ చేశారు.
పోలీసులకు అవమానం
కారు డ్రైవర్ చేసిన చాలెంజ్ ను బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అవమానంగా భావించారు. నిందితుడు రఘును పట్టుకోవాలని బెంగళూరు నగర ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ డాక్టర్ బి.ఆర్. రవికాంత్ గౌడ భావించారు. వెంటనే మైసూరు కమిషనర్ నరసింహరాజును సంప్రధించిన రవికాంత్ గౌడ జరిగిన విషయం చెప్పారు కారు డ్రైవర్ ఎంత అహంకారంతో మాట్లాడాడు అనే విషయం మైసూరు పోలీసులు తెలుసుకున్నారు.
కారు డ్రైవర్ ఎక్కడ ?
మైసూరు పోలీసు కమిషనర్ నరసింహరాజు ఆదేశాలతో జిల్లా పోలీసులు కారు డ్రైవర్ రఘు ఎక్కడ ఉన్నాడు అని గాలించారు. కేఏ 09- బి,1200 నెంబర్ కారు డ్రైవర్, దాని యజమాని కోసం పోలీసులు గాలించారు. చివరికి కారు డ్రైవర్ రఘును పోలీసులు గుర్తించి అతన్ని పట్టుకున్నారు.
కారు పత్రాలు లేవు
కారు డ్రైవర్ వీడియోలో పోలీసులకు చాలెంజ్ చేసినట్లు ఆ కారుకు ఎలాంటి దృవీకరణ పత్రాలు లేవు అనే విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. తాను చేసిన ఇంత చాలెంజ్ ఇంత పెద్దఎత్తున ప్రచారం అవుతుందని ఊహించలేదని, తనను క్షమించాలని కారు డ్రైవర్ రఘు వేడుకుంటున్నాడని పోలీసు అధికారులు అన్నారు.
బెంగళూరులో హల్ చల్
గతంలో కారు డ్రైవర్ రఘు బెంగళూరులో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి కారు నడిపాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బెంగళూరులో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి కారు నడిపాడని, సిగ్నల్ జంప్ చేశాడని ఇంతకు ముందు రూ. 1,200 ఫైన్ వేశామని, ఆ నగదు ఇంకా రఘు చెల్లించలేదని పోలీసు అధికారులు తెలిపారు.