మీ అందరి ప్రశ్నలకు నా వద్ద సమాధానం: లలిత్ గేట్పై సుష్మ
న్యూఢిల్లీ: లలిత్ గేట్ వ్యవహారంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం నాడు లోకసభలో వివరణ ఇచ్చారు. తాను లలిత్ మోడీ కోసం ఎలాంటి సిఫార్సులు చేయలేదని, ఆధారాలుంటే చూపాలని, మీ అందరి ప్రశ్నలకు తన వద్ద సమాధానం ఉందని, తన పైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన పైన వచ్చిన ఆరోపణలను నిరాధారమని చెప్పారు. తన పైన వచ్చిన ఆరోపణల పైన ఆమె లోకసభలో వివరణ ఇచ్చారు. మీడియాలో జరుగుతోంది అంతా దుష్ప్రచారమే అన్నారు. తన పైన వచ్చిన ఆరోపణల పైన చర్చ జరగాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీతో చర్చకు తాను సిద్ధమేనని ప్రకటించారు. తాను చర్చకు సిద్ధమని చెప్పినా సభలో ఆ వాతావరణం కనిపించడం లేదన్నారు. తన పైన చేసిన ఆరోపణలను విపక్షాలు రుజువు చేయగలవా అని ప్రశ్నించారు. అందరి ప్రశ్నలకు తన వద్ద సమాధానాలు ఉన్నాయని చెప్పారు.
లలిత్ మోడీ కోసం తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఏ సిఫార్సు చేయలేదని చెప్పారు. నేను ఎలాంటి సిఫార్సులు చేయలేదని బ్రిటిష్ ప్రభుత్వమే చెప్పిందన్నారు. లలిత్ మోడీ విషయంలో నేను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని చెప్పారు. తాను సిఫార్సు చేసినట్లుగా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు.
లలిత్ మోడీ భార్య పదిపదిహేనేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతోందన్నారు. తన పైన రెండు నెలలుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పైన వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చెప్పారు. లలిత్ కోసం తాను బ్రిటన్ హైకమిషనర్తో మాట్లాడలేదన్నారు.
లలిత్ మోడీ వ్యవహారం తాను బ్రిటన్కే వదిలేశానని చెప్పారు. లలిత్ భార్య క్యాన్సర్తో బాధపడుతున్నందున మానవతా దృక్పథంతో బ్రిటన్ వీసా ఇచ్చిందని చెప్పారు. లలిత్ మోడీ భార్య అభ్యర్థన మేరకే బ్రిటన్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.