సీఎం సిద్దూ కోసం చాలెంజింగ్ స్టార్ ప్రచారం, ప్రజల వ్యతిరేకత, హీరో దెబ్బకు లాఠీచార్జ్, కష్టం!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఎలాగైనా గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకుతోడు సినీతారలు సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బహుబాష నటుడు, దర్శకుడు, రాజమౌళి ఈగ సినిమా ఫేం కిచ్చ సుదీప్ తాను సీఎం సిద్దరామయ్య తరపున ప్రచారం చేస్తానని ఇప్పటికే చెప్పారు. సీఎం సిద్దరామయ్య తరపున స్యాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్ ప్రచారం చేస్తున్నాడు.
సీఎంకు టెన్షన్
మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య ఓడిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. చాముండేశ్వరి నియోజక వర్గంలో జేడీఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ విజయం సాధిస్తారని పలు సర్వేలు చెబుతున్నాయి.
చాలెంజింగ్ స్టార్ ప్రచారం
చాముండేశ్వరి నియోజక వర్గంలోని నాగేనహళ్ళిలో శనివారం స్యాండిల్ వుడ్ స్టార్ చాలెంజింగ్ స్టార్ దర్శన్ సిద్దరాయ్యను గెలిపించాలని ప్రచారం చేశారు. సిద్దరామయ్య కుమారుడు రాకేష్ మరణించినా ఆయన కుంగిపోకుండా ప్రజా సేవ చేశారని హీరో దర్శన్ ఈ సందర్బంగా స్థానిక ప్రజలకు చెప్పారు.
ప్రజల కోసం సిద్దూ
కుమారుడు రాకేష్ మరణించాడని సీఎం సిద్దరామయ్య కుంగిపోలేదని, దుఃఖం దిగమింగుకుని ప్రజల కోసం నిత్యం ఆయన పని చేశారని హీరో దర్శన్ అన్నారు. కుమారుడు లేడని భాదను మరిచిపోయి ప్రజాసేవ చేసిన సీఎం సిద్దరామయ్యకు ఓటు వేసి గెలిపించాలని హీరో దర్శన్ ప్రజలకు మనవి చేశారు.
హీరోకు చేదు అనుభవం
నాగేనహళ్ళిలో హీరో దర్శన్ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో జేడీఎస్ కార్యకర్తలు ఆ పార్టీ జెండాలు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. హీరో దర్శన్ ప్రసంగాన్ని అడ్డుకుని దేవేగౌడ జిందాబాద్, దర్శన్ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పదేపదే హీరో దర్శన్ రోడ్ షో, ప్రసంగాన్ని అడ్డుకుంటూ జేడీఎస్ పార్టీ జెండాలు చూపించి నిరసన వ్యక్తం చెయ్యడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.
ఉద్రిక్తపరిస్థితి
హీరో దర్శన్ రోడ్ షో అడ్డుకుని జేడీఎస్ జెండాలు చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తలకు పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని పరిస్థితి అదుపుతప్పింది.
హీరో దెబ్బకు లాఠీచార్జ్
నిరసన వ్యక్తం అవుతున్నా రోడ్ షో పూర్తి చేసి ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన హీరో దర్శన్ ప్రచార వాహనం కిందకు దిగి కారు ఎక్కుతున్న సమయంలో జేడీఎస్ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఆ సమయంలో పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి జేడీఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు.