కొత్త చిక్కుల్లో చందా కొచ్చర్..బిగుసుకుంటున్న ఉచ్చు: వెలుగు చూసిన క్విడ్ ప్రొ కో
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అగ్రగామిగా ఉన్న ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్ కొత్త చిక్కులను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమె నివాసాల్లో సోదలను చేపట్టింది. చందా కొచ్చర్తో పాటు వీడియోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్ ఇంటిపై కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్ దంపతులకు చెందిన ముంబయితోపాటు ఇతర ప్రాంతాల్లోని అయిదు కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం తనిఖీలు చేపట్టినట్లు వారు వెల్లడించారు.
ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ హోదాలో ఆమె వీడియోకాన్ గ్రూప్కు నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశారనే ఆరోపణలను చందా కొచ్చర్ ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఆమె పెద్ద ఎత్తున అవినీతికి, ఆర్థికంగా అవకతవకలకు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. దీనితో ఆమెపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఇందులో భాగంగా ఇప్పటికే చందా కొచ్చర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్లపై సీబీఐ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
వీడియోకాన్ గ్రూప్నకు ఐసీఐసీఐ బ్యాంక్ 3,250 కోట్ల రూపాయల మేర రుణాలు మంజూరు చేయడంలో మాజీ సీఈవో చందా కొచ్చర్ కీలక పాత్ర పోషించారని సీబీఐ, ఈడీ కేసు నమోదు చేశాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్.. చందా భర్త దీపక్ కొచ్చర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఈ విషయం క్విడ్ ప్రో కో కిందికి వస్తుందని ఈడీ అధికారులు తెలిపారు. ఇతర లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఐసీఐసీఐ కూడా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక విచారణలో నిర్ధరించిన సీబీఐ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.