ఈ శతాబ్దంలో వచ్చే అరుదైన చంద్ర గ్రహణం: తిలకించిన ప్రపంచం
న్యూఢిల్లీ: ఈ శతాబ్ధంలో వచ్చే అరుదైన అరుణవర్ణ సుదీర్ఘ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని శుక్రవారం రాత్రి నుంచి ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా తిలకించింది. ఈ అరుదైన చంద్ర గ్రహణం భారతదేశంలోని ఏ అన్ని ప్రాంతాల ప్రజలు ఈ గ్రహణాన్ని వీక్షించారు. పలు ప్రాంతాల్లో మేఘావృతం కావడంతో ఆ ప్రాంతాల వారు మాత్రం ఈ అద్భుతాన్ని మిస్సయ్యారు.
గ్రహణాలపై ప్రపంచ వ్యాప్తంగా అనేక నమ్మకాలున్నాయి. దీంతో గ్రహణం రోజున అరుణ వర్ణంలో మెరిసే చంద్రుడితో సెల్ఫీలు దిగి మూఢనమ్మకాలకు పాతరేద్దామని ప్రపంచ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. గ్రహణ సమయంలో హాయిగా ఇష్టమైన వంటకాలనూ తినాలని సూచించారు.
కాగా, శుక్రవారం రాత్రి 11.45 గంటలకు ఆకాశంలో ఈ అద్భుతం మొదలైంది. 21వ శతాబ్దంలోనే సుదీర్ఘ(గంట 43 నిమిషాలు) సంపూర్ణ అరుణవర్ణ చంద్రగ్రహణంగా ఇది రికార్డు సృష్టించింది. దీనికితోడు ఇదేరోజు అరుణ గ్రహం భూమికి చేరువగా వచ్చింది.
పలు దశల్లో గ్రహణం
చంద్ర గ్రహణంలో మొదటి దశ 10:45 గంటలకు ప్రారంభమైంది. దీనిని పెనంబ్రల్ ఫేజ్ అంటారు. ఈ దశలో గ్రహణం లక్షణాలు కనిపించవు. రాత్రి 11:54 గంటలకు చంద్రుడిపై భూమి నీడ పడటం మొదలవుతుంది. దీనిని అంబ్రల్ ఫేజ్ అంటారు. ఇది శనివారం తెల్లవారుజాము 3:49 వరకు కొనసాగుతుంది. ఈ ఫేజ్ ముగిసే సమయానికి భూమి నీడ నుంచి చంద్రుడు బయటపడుతాడు. ఈ అంబ్రల్ ఫేజ్లోనే రాత్రి ఒంటి గంట నుంచి 2:43 గంటల వరకు భూమి నీడ చంద్రుడిని పూర్తిగా ఆక్రమిస్తుంది. దీనిని టోటాలిటీ ఫేజ్ లేదా సంపూర్ణ దశ అంటారు.
సుదీర్ఘ గ్రహణంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి..
ఆసియా, ఆఫ్రికా ఖండాల ప్రజలు చంద్రగ్రహణాన్ని సంపూర్ణంగా చూడగలుగుతారు. ఐరోపా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. మనకు గ్రహణం సమయంలో ఉత్తర అమెరికా, అంటార్కిటికా, రష్యాలోని ఉత్తర ప్రాంతాల్లో పగలు కావడంతో అక్కడి ప్రజలు గ్రహణాన్ని వీక్షించలేరు.
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఖగోళ ప్రియులు, ప్రజలు గ్రహణ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి చూడలేనివారు మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడాలంటే 2025 సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందేనని ప్లానెటరీ సొసైటీ ఇండియాకు చెందిన ఎన్ శ్రీ రఘునందన్కుమార్ తెలిపారు. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదని, నేరుగా కండ్లతోనే చూడవచ్చని తెలిపారు. చంద్ర గ్రహణం నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచే ప్రముఖ ఆలయాలు మూసివేశారు. తిరిగి ఈ ఆలయాలు చంద్ర గ్రహణం పూర్తయిన తర్వాత సంప్రోక్షణం చేసి తెరుస్తారు.