మోడీ ట్విస్ట్.. బాబు మౌనం: టిడిపికి ఒక్కటే, అశోకకు..
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ కేబినెట్లో రెండు కేబినెట్ ర్యాంక్ పదవులు వస్తాయని తెలుగుదేశం పార్టీ మొదటి నుండి భావించింది. అయితే టిడిపికి ఒక్క కేబినెట్ పోస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం కాబోయే ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక్క కేబినెట్ పదవి ఇచ్చేందుకు మోడీ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
టిడిపి మొదటి నుండి రెండు మంత్రి పదవులు వస్తాయని భావించింది. అయితే రేపు (26, సోమవారం) నరేంద్ర మోడీతో పాటు టిడిపికి చెందిన ఒక్క మంత్రే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీ కేబినెట్లో ఇద్దరికి అవకాశమిస్తే... అశోక గజపతి రాజుకు కేబినెట్ పోస్ట్, సుజనా చౌదరికి సహాయ మంత్రి పదవి వస్తుందని అందరు భావించారు. కానీ ఇప్పుడు ఒక్కటే పదవి ఇచ్చేందుకు మోడీ సిద్ధం కావడంతో ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అశోక గజపతి రాజు చాలా సీనియర్ నాయకుడు. ఈ కారణంగా సుజనా చౌదరి కంటే అశోక వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశముందని అంటున్నారు. కాగా, మోడీతో పాటు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ... త్వరలో మోడీ మంత్రివర్గ విస్తరణ చేస్తారని అప్పుడు మరో ఇద్దరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. కాగా, మోడీతో చంద్రబాబు ఢిల్లీలోని గుజరాత్ భవన్లో అరగంట పాటు మాట్లాడారు. మోడీతో భేటీ తర్వాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడకుండా వెళ్లారని సమాచారం.
డిమాండ్ చేయట్లేదు: సిఎం రమేష్
తాము మోడీ కేబినెట్లో మంత్రి పదవుల కోసం ఎలాంటి డిమాండ్ చేయడం లేదని సిఎం రమేష్ న్యూఢిల్లీలో అన్నారు. సీమాంధ్రకు నిధులే తమ లక్ష్యమన్నారు. మోడీ కేబినెట్లో ఒక్కరికే అవకాశం దక్కవచ్చునని చెప్పారు. పూర్తిస్థాయి విస్తరణలో అవకాశం వస్తుందని భావిస్తున్నామన్నారు.