చివరి ప్రయత్నం: చంద్రబాబు ఆశలు ఫలించేనా... దేవేగౌడ భేటీలో ఏం జరిగింది..?
Recommended Video
బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ సమావేశాలు పెరిగిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికి వన్ సైడ్ విక్టరీ డిక్లేర్ చేసినప్పటికీ... విపక్ష పార్టీల్లో మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గలేదు. తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నమ్మకం లేదని గ్రౌండ్ రియాల్టీలో తమవైపే ప్రజలు నిలిచారన్న గట్టి నమ్మకంతో విపక్షాలున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి పలువురితో వరుస భేటీలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వరుస భేటీలతో చంద్రబాబు బిజీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస భేటీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. గత ఆదివారం నుంచి పలువురు ఎన్డీయేతర పార్టీ అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ వేదికగా రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇలా జాతీయ స్థాయిలో నేతలందరితోను ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు. దీంతో ఆయన రాజకీయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొందరైతే చంద్రబాబుకు ఉన్న ఓపికను ప్రశంసించలేకున్నారు.
ఢిల్లీ నుంచి బెంగళూరుకు
తాజాగా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో విపక్షపార్టీ నేతలతో కలిసి ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లారు. అక్కడ జనతాదల్ సెక్యులర్ అధినేత హెచ్డీ దేవెగౌడ, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలను కలిశారు. బీజేపీయేతర పార్టీలకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ - జేడీఎస్లు అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఒకవేళ హంగ్ పార్లమెంటు వస్తే జేడీఎస్ మద్దతు ఎన్డీయేతర పార్టీలకు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. జేడీఎస్ కూడా తమ ప్రధాని అభ్యర్థి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అని ఇప్పటికే తేల్చేసింది.
శుక్రవారం ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానం
దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీలో చంద్రబాబు చాలా విషయాలే చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాను ఇతర జాతీయ నేతలతో సమావేశం సందర్భంగా మాట్లాడిన అంశాలు దేవెగౌడ దృష్టికి తీసుకొచ్చారు. ఇక లోక్సభ ఫలితాలు వెలువడిన తర్వాత శుక్రవారం జరిగే విపక్ష పార్టీల సమావేశానికి ఢిల్లీకి రావాల్సిందిగా దేవెగౌడ, కుమారస్వామిలను తాను కోరినట్లు సమావేశం తర్వాత చంద్రబాబు తెలిపారు.
ఇదిలా ఉంటే జేడీఎస్ కాంగ్రెస్తో పొత్తులో భాగంగా ఏడు స్థానాలకు తమ అభ్యర్థులను పోటీకి పెట్టింది. మిగతా 21 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అయితే ఎవరి అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే గురువారం ఫలితాలు విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.